జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా స్పందన: బండి సంజయ్కి అభినందనలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన ఫలితాలను సాధించింది. రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి ఫలితాలను సాధించింది.
ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ' ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో అభివృద్ధే లక్ష్యంగా సాగిస్తున్న బిజెపిరాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు' అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
అంతేగాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కి అమిత్ షా అభినందనలు తెలిపారు. అలాగే, బీజేపీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆయన తెలుగులోనే ట్వీట్ చేయడం గమనార్హం.
ప్రధానమంత్రి @narendramodi గారి సారధ్యంలో,అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బిజెపి రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు.
— Amit Shah (@AmitShah) December 4, 2020
GHMC ఎన్నికల అద్భుతమైన ప్రదర్శనకు @JPNadda గారికి & @bandisanjay_bjp కు అభినందనలు.@BJP4Telangana కార్యకర్తల యొక్క కృషిని అభినందిస్తున్నాను.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర నేతలు బండి సంజయ్, కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే రాజా సింగ్ నేతలు లక్ష్మణ్, వివేక్, డీకే అరుణ తదితరులు ప్రచారం నిర్వహించగా, జాతీయ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, తదితరులు బీజేపీ అభ్యర్థులకు మద్దుతగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నిక ఫలితాల్లో 150 స్థానాలకు గానూ టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 48 స్థానాల్లో గెలుపొందింది. ఎంఐఎం పార్టీ 44 స్థానాలను కైవసం చేసుకుంది. 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతైంది.
Recommended Video