అమిత్ రోడ్ షోలో పవన్ కల్యాణ్ కటౌట్లు: భారీగా ఎగిరిన జనసేన జెండాలు: కంట్లో పడే తాపత్రయమా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్సొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హవా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు హైదరాబాద్కు వచ్చిన ఆయన నిర్వహించిన రోడ్ షో.. బీజేపీ సత్తాకు అద్దం పట్టింది. బీజేపీతో కలిసి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోడ్ షోలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమిత్ షా ర్యాలీకి జనసేన నేతలు మద్దతు ప్రకటించారు. భారీ సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి జనసేన పార్టీ తప్పుకొన్నప్పటికీ.. బీజేపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది.
Recommended Video
అమిత్ షా నిర్వహించిన రోడ్ షోలో జనసేన కార్యకర్తలు.. తమ పార్టీ జెండాలను భుజాన వేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొందరు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పవన్ కల్యాణ్ కటౌట్లను భుజాన మోస్తూ తిరగడం ఆకర్షణగా నిలిచింది. ఒకదశలో కాషాయ జెండాలతో పోటీ పడుతూ గాజు గ్లాస్, పవన్ కల్యాణ్ ఫొటోను ముద్రించిన తెలుపురంగు జెండాలు అమిత్ షా రోడ్ షోలో కనిపించాయి. జనసేనతో పొత్తు ప్రసక్తే లేదంటూ బీజేపీకి చెందిన నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేయడం, దానికి తెలంగాణ జనసేన నేతలు కౌంటర్ ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో.. పొత్తుపై అనుమానాలు నెలకొన్నాయి.
#WATCH | Telangana: Union Home Minister and BJP leader Amit Shah holds roadshow at Warasiguda in Secunderabad. #GHMCElections2020 pic.twitter.com/EvichhTSY3
— ANI (@ANI) November 29, 2020
ఈ అనుమానాలను అమిత్ షా ర్యాలీ వాటిని పటాపంచలు చేసింది. జనసేన కార్యకర్తలు అనూహ్యంగా అమిత్ షా ర్యాలీకి మద్దతు ఇచ్చారు. జేజేలు పలికారు. దారి పొడవునా జన సైనికులు ఈ ర్యాలీలో సందడి చేస్తూ కనిపించారు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలకు జై కొట్టారు. పవన్ కల్యాణ్ పాత్ర నామమాత్రంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను జన సైనికులు ఏ మాత్రం తీవ్రంగా పరిగణించట్లేదనే విషయం ఈ ర్యాలీతో తేలిపోయింది. ఇక వారి ఓటు ఎటు పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.