బీజేపీ చీఫ్ అమిత్ షా పర్యటన రద్దు.. ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నందునే ..
హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రావడం లేదని బీజేపీ ప్రకటించింది. ఈ నెల 17న ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నందునే ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయిందని పేర్కొన్నది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈ నెల 17న బీజేపీ బహిరంగ సభకు అమిత్ షాను ఆహ్వానించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పటాన్చెరులో జరిగే సభకు అమిత్ షా వస్తారని .. తొలుత బీజేపీ అధికారికంగా ప్రకటించింది. అయితే అదేరోజు ఢిల్లీలో బిజీగా ఉండటంతో పర్యటన రద్దయిందని తెలిపింది. ఆయన స్థానంలో మరో నేత ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఎంఐఎం హవా కొనసాగుతుందని విమర్శించారు. మజ్లీస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటే ప్రజల గొంతు నొక్కడమేనని విమర్శించారు. నిజాం నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని స్మరించుకోవాలని గుర్తుచేశారాయన. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ రోజున అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలు ఎగురవేస్తామని పేర్కొన్నారు.