జగన్ పార్టీతో కటీఫ్?: వైఎస్ షర్మిలతో యాంకర్ శ్యామల: పార్టీని ప్రకటించడమే ఆలస్యం
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లోకి త్వరలో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వడానికి సమాయాత్తమౌతోన్న వైఎస్ షర్మిలకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు షర్మిల నెలకొల్పబోయే పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో రాజకీయంగా ఎదిగిన వారు.. షర్మిల ప్రకటించబోయే పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సన్నాహాలు చేస్తోన్నారు. పార్టీని ప్రకటించడమే ఆలస్యం.. అన్నట్టుగా ఉంది వారి పరిస్థితి.
కాగా- ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న కొందరు ప్రముఖులు కూడా పార్టీ ఫిరాయించడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో స్థిరపడి, ఆ నగరాన్ని వదిలి ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఇష్టపడని ప్రముఖులు.. షర్మిల పార్టీని ప్రత్యామ్నాయంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా- యాంకర్ శ్యామల వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. భర్త నరసింహా రెడ్డితో కలిసి శ్యామల.. లోటస్ పాండ్ నివాసంలో షర్మిలను కలిశారు. లోటస్పాండ్ నివాసానికి శ్యామల వెళ్లడం ఇది రెండోసారి. ఇదివరకు ఓ సారి ఆమె షర్మిల భర్త బ్రదర్ అనిల్తో భేటీ అయ్యారు.
ఆమె ప్రకటించబోయే పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే సంకేతాలను శ్యామల పరోక్షంగా పంపించినట్టయింది. ప్రస్తుతం ఆమె వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. ఆ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు శ్యామల తన భర్తతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి, వైసీపీ కండువాను కప్పుకొన్నారు. తాజాగా- తెలంగాణలో ఆయన సోదరి పెట్టబోయే పార్టీ కండువాను కప్పుకోవడానికి సన్నద్ధమయ్యారు. వైఎస్ షర్మిల తలపెట్టిన ఆత్మీయ సమావేశాలు.. కొంత విరామం తరువాత పునఃప్రారంభం కానున్నాయి. మంగళవారం ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో సమావేశం కానున్నారు.