బస్ భవన్ లో ఏపీ, తెలంగాణా ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ..దసరాకైనా బస్సులు నడుస్తాయా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించి నేడు మరోమారు ఇరురాష్ట్రాల ఉన్నతాధికారుల భేటీపై ఆసక్తి నెలకొంది . అంతర్ రాష్ట్రాల మధ్య బస్సులను పునరుద్ధరించడం, ఎన్ని కిలోమీటర్లు బస్సులను నడపాలన్న దానిపైన ఇంతకు ముందు భేటీలో అధికారులు చర్చల్లో పురోగతి సాధించినా సరే ఆర్టీసీ బస్సులు మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య రోడ్డెక్కలేదు.
తెలంగాణ రాష్ట్రం పెట్టిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొగ్గు చూపినా , సామరస్య పూర్వకంగా పరిస్కరించుకుందామని , బస్సుల రవాణా కొనసాగిద్దాం అని చెప్పినా అన్ని అంశాలపై ఏకాభిప్రాయం వచ్చాకే బస్సుల రవాణా అని స్పష్టం చేసింది తెలంగాణా.
నేడు మరోమారు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం నేపథ్యంలో ఇప్పుడైనా బస్సుల అంతర్రాష్ట్ర రవాణాకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాదులోని బస్ భవన్ లో సమావేశం కానున్న ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు ఏకాభిప్రాయానికి వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు నడుపుతామని ఏపీ అంటున్నా , రూట్ల ప్రాతిపదికన బస్సులు నడపాలని తెలంగాణ వాదిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.
దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేలా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై తాత్కాలిక ఒప్పందానికి సిద్ధమైన ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులపై నేడు తాడోపేడో తేల్చుతారా అన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలతో తెలంగాణ ,మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల మధ్య సర్వీసులు కొనసాగుతున్నాయి.
కేవలం ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య మాత్రమే అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడవలేదు. దీంతో ప్రైవేటు బస్సులు లాభ పడుతున్నాయి. నేడు చర్చలు జరగనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులపై ఒక నిర్ణయం తీసుకోకుంటే దసరాసీజన్ లో రెండు రాష్ట్రాల ఆర్టీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది.