వదళ బొమ్మాళీ: మరో వివాదంలో మేయర్ గద్వాల..
గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐదేళ్లు హైదరాబాద్లో వర్షాలు పడొద్దని కామెంట్ చేయడంతో రాజకీయ ప్రకంపనాలు చెలరేగాయి. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తనను కలువడానికి వచ్చినవారికి ఓటు వేయాలని కోరారు. దీంతో మరో వివాదం రాజుకుంది.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన వారికి మేయర్ టీఆర్ఎస్ కరపత్రాలు పంచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి తన ఛాంబర్లో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడం ఎన్నికల కోడ్కు విరుద్దమని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఇటీవల మేయర్ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని వారికి మేయర్ కరపత్రాలు పంచారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. మేయర్ గద్వాల విజయలక్ష్మిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘననే అని అంటున్నాయి. ఇందుకు సంబంధించి మేయర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.