స్వామీజీల్లో చిన జీయర్ వేరయా.!
హైదరాబాద్ : స్వామీజీలది ఆధ్యాత్మిక ప్రపంచం. ప్రవచనాలు బోధిస్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించే తత్వం వారిది. అయితే చినజీయర్ స్వామిలో మాత్రం మరో కోణం కనిపిస్తుంటుంది. మనుషులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరని చెబుతుండే ఆయన.. సైన్స్ ను కూడా మేళవించి ముందుకెళుతున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధిస్తూనే.. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా ఆయనలో స్వామీజీని మాత్రమే చూసిన భక్తులు.. ఇక ఆయనలోని కొత్త పార్శాన్ని చూడబోతున్నారు.
ప్రజలకు అవగాహన
ఇప్పటివరకు చినజీయర్ స్వామిని స్వామీజీగానే చూశారు అందరు. కానీ ఇప్పుడు ఆయనలోని మరో సేవాగుణం కూడా చూడబోతున్నారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టేలా మహా ప్రణాళిక సిద్ధం చేశారు. సోమవారం ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహించారు. శంషాబాద్ పరిధిలోని శ్రీరామనగర్ లో ఉన్న జిమ్స్ హోమియోపతిక్ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్యాన్సర్ ను తరిమికొట్టాలంటే ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
మహమ్మారిని తరిమికొడదాం..!
క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చిన చినజీయర్ స్వామి.. వ్యాధి నివారణకు కృషి చేస్తున్న వైద్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని క్యాన్సర్ రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. వికాస తరంగిణి, జిమ్స్ సంస్థల సౌజన్యంతో మహిళా ఆరోగ్య వికాస్ కు శ్రీకారం చుట్టామని తెలిపారు. అందులోభాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు నేపాల్, తమిళనాడు తదితర ప్రాంతాల్లో 863 ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 40వేల మందికి క్యాన్సర్ ప్రారంభదశలో ఉన్నట్లు గుర్తించి వైద్యం అందించామని చెప్పారు.
దేశమంతటా వైద్య శిబిరాలు..!
క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం దేశవ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు చినజీయర్ స్వామి. ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని చెప్పారు. త్వరలో 120 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. అందులో దాదాపు 60 వేల మంది మహిళలకు క్యాన్సర్ పరీక్షలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానాలపై ప్రముఖ వైద్య నిపుణులు మోహన్ వంశీ అవగాహన కల్పించారు.