హైదరాబాద్లో పరువు హత్య.. ప్రణయ్ హత్య లాగే...కిరాయి మనుషులతో అల్లుడిని చంపించిన మామ
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మిర్యాలగూడ పరువు హత్య తరహాలోనే తెలంగాణలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. తన కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ తండ్రి అల్లుడిని కిడ్నాప్ చేయించి కిరాతకంగా హత్య చేయించాడు.సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెంలో యువకుడి మృతదేహం లభ్యమవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడిని హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నివాసముండే హేమంత్గా గుర్తించారు. కలకలం రేపుతున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
నిర్దాక్షిణ్యంగా... అత్తను చంపిన 9 ఏళ్ల బాలుడు... కుటుంబ పరువు తీసిందని...
హేమంత్-అవంతి... అసలేం జరిగింది...
హైదరాబాద్లోని చందానగర్కి చెందిన హేమంత్,అదే ప్రాంతానికి చెందిన అవంతి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈ ఏడాది జూన్ 10న ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే అవంతి ఈ పెళ్లి చేసుకోవడం ఆ కుటుంబానికి ఇష్టం లేదు. ముఖ్యంగా తండ్రి లక్ష్మారెడ్డి ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత చందానగర్లో కాకుండా హేమంత్-అవంతి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం(సెప్టెంబర్ 24) ఉదయం హేమంత్ ఇంట్లోకి చొరబడ్డ కొంతమందిని అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
సంగారెడ్డిలో శవమై...
కిడ్నాప్పై అతని భార్య అవంతి,కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా... సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని ఓ చెట్ల పొదల్లో గుర్తు తెలియని మృతదేహం పడి వున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు అది హేమంత్ మృతదేహమే అని నిర్దారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అవంతి తండ్రే హంతకుడు...?
అవంతి తండ్రి లక్ష్మారెడ్డి కిరాయి మనుషులతో హేమంత్ను కిడ్నాప్ చేయించి సంగారెడ్డిలో హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా... అవంతి తల్లిదండ్రులతో పాటు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మారెడ్డి ఇంత దారుణానికి ఒడిగడుతాడని ఊహించలేదని హేమంత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కులాలు వేరు కావడమే హేమంత్ హత్యకు కారణమని అతడి తల్లి ఆరోపించారు. సందీప్రెడ్డి, రాకేశ్రెడ్డి, రంజిత్రెడ్డి, యుగేందర్రెడ్డి, విజయేందర్ రెడ్డే తమ కుమారుడిని హత్య చేయించారని ఆరోపించారు. గతంలోనూ పలుమార్లు ఇంటికి వచ్చి మరీ బెదిరించారని... హేళన చేసి మాట్లాడారని చెప్పారు.
అవంతి ఏమంటున్నారు....
చిన్నప్పటి నుంచి తాను,హేమంత్ ఒకే ప్రాంతంలో పెరిగామని అవంతి తెలిపారు. 8 ఏళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని 4 నెలల క్రితమే వివాహం చేసుకున్నామని చెప్పారు. తమ ఇంట్లో వాళ్లకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో... పెళ్లి తర్వాత గచ్చిబౌలిలో ఉంటున్నట్లు చెప్పారు. పలుమార్లు ఇంటికి కూడా వచ్చి బెదిరించారని.. గురువారం గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటికొచ్చి హేమంత్ను కిడ్నాప్ చేశారని చెప్పారు. బావ, వదినలు, మావయ్యలే ఈ హత్య చేయించారని ఆరోపించారు. ఇంత దారుణానికి ఒడిగడుతారని ఊహించలేదంటూ కన్నీరుమున్నీరయ్యారు.