ఈఎస్ఐలో మరో స్కాం: హెచ్ఐవీ మెడికల్ కిట్ల పేరుతో, కోటి 76 లక్షలు స్వాహా...
ఈఎస్ఐలో మరో స్కాం బయటపడింది. నకిలీ బిల్లులతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ రూ. కోట్ల కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన ఏసీబీ దేవికారాణి, పద్మ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నది. అయితే దీంతోపాటు హెచ్ఐవీ మెడికల్ కిట్ల పేరుతో కోటి 76 లక్షల స్కాం జరిగిందని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.
మెడికల్ కిట్ల పేరుతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జేడీ పద్మ సిబ్బంది స్కాం చేశారని తెలిపారు. దేవికారాణి అండతోనే కుంభకోణం జరిగిందని వెల్లడించారు. 2017-18లో మెడికల్ కిట్ల కోసం రూ. 60 కోట్లు కేటాయించారు. ఇందులో మొత్తం 22 ఇండెంట్లు ఉన్నాయి. అయితే 2 ఇండెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఇందులో స్కాం జరిగినట్టు గుర్తించారు. హెచ్ఐవీ మెడికల్ కిట్ల పేరుతో కోటి 76 లక్షలను నొక్కేశారని పేర్కొన్నారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్న దేవికారాణి, పద్మ, సురేంద్రనాథ్ తదితరులను విచారిస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.
ఈఎస్ఐలో మెడికల్ స్కాం జరిగిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ దేవికారాణి అండతో సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ రెచ్చిపోయాడు. జేడీ పద్మ కూడా వీరికి సహకరించారు. నకిలీ మెడికల్ బిల్లుల పేరుతో రూ.10 కోట్ల దోచుకున్నారు. ఈఎస్ఐ మెడికల్ కుంభకోణాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. స్కాం వెలుగులోకి వచ్చాక డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, సురేంద్రనాథ్ సహా 16 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా రిమాండ్లో ఉండగా.. హెచ్ఐవీ మెడికల్ కిట్ల స్కాం వెలుగులోకి వచ్చింది.