అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు: వైయస్ అయినా.. కేసీఆర్ అయినా మాకు గొడుగు పట్టాల్సిందే..!
మజ్లిస్ పార్టీ తలచుకుంటే ఎవరినైనా సీఎం పీటం పై కూర్చోబెడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత చాంద్రాయణగుట్ట తాజా మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్లో యాకుత్పురాలో ఆయన ఓ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ ముందు ఎవరైనా సరే తలదించుకోవాల్సిందే అని అక్బరుద్దీన్ అన్నారు. వైయస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ఇలా ఎవరైనా సరే మజ్లిస్కు గొడుగు పట్టాల్సిందే అని వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 11 తర్వాత మజ్లిస్ పవర్ ఏమిటో ప్రపంచానికి చూపిస్తామని అక్బరుద్దీన్ అన్నారు. తను రాజకీయనేత కాదని చెబుతూనే తను ఒక పొలిటికల్ కింగ్ అని చెప్పుకున్నారు. ముఖ్యమంత్రులు తమ ముందు తలవంచాల్సిందేనన్న కామెంట్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. కొద్ది రోజుల క్రితం అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ నిర్మల్కు ప్రచారానికి రాకపోతే కాంగ్రెస్ 25 లక్షల రూపాయలు ఇస్తామంటూ కాంగ్రెస్ నేత మాట్లాడిన ఆడియో టేపులను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు అక్బరుద్దీన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అక్బరుద్దీన్ ప్రస్తుతం చాంద్రాయణగుట్ట నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆయనపై పోటీకి కాంగ్రెస్ నుంచి ఈసా మిస్రీ బరిలోకి దిగుతున్నారు.
ఇదిలా ఉంటే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి స్పందించారు. మజ్లిస్ నేత కేసీఆర్తో పొత్తుతో ఉన్నారని అన్నారు. హిందూ సమాజాన్ని భయపెట్టి లొంగదీసుకోవాలనే ప్రయత్నం అక్బరుద్దీన్ చేస్తున్నారని ఇంద్రసేనా రెడ్డి అన్నారు. హిందూ ముస్లింల మధ్య గొడవపెట్టి విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో కూడా చంద్రబాబును కాంగ్రెస్ను మజ్లిస్ పార్టీ లొంగదీసుకుందని... కేసీఆర్ విషయంలో కూడా అదే జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న ఆయన తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు.