ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర..!! సంచలన వ్యాఖ్యలు చేసిన మురళీధరరావు
హైదరాబాద్/ అమరావతి : తెలుగురాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. తెలంగాణ కన్నా ఏపీపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. త్వరలో ఏపీ బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు సంకేతాలిస్తున్నారు. దీంతో బీజేపీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందని చెప్పడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విపక్ష టీడీపీ నుంచి వలసలా ? లేదంటే అధికార పార్టీ నుంచి చేరికలు ఏమైనా ఉన్నాయా అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి.
జమ్ము కాశ్మీర్ పై మోడీ ఫోకస్..! యువతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు..!!
ఏపీలో బీజేపీ బూస్ట్ ..
తెలంగాణలో కన్నా ఏపీలో బీజేపీ బలపడుతుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు. త్వరలో ఏపీ బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా అవతరించబోతుందని జోష్యం చెప్పడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ఏపీ బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు తమతో టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మురళీధర్ రావు. ఏపీలో బీజేపీ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఏకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పడం పొలిటికల్ సర్కిళ్లలో హీట్ పెంచుతుంది.
తెలంగాణలోనూ ..
తెలంగాణలోనూ బీజేపీ పుంజుకుంటుందని చెప్పారు. తెలంగాణలో తమకు రెండు లక్ష్యాలు ఉన్నాయని వివరించారు. ఒకటి అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొవడం, రెండోది కాంగ్రెస్ పార్టీకి ఉన్న 29 శాతం ఓటుబ్యాంకును బీజేపీకి మళ్లించడం అని వివరించారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టంచేశారు. ఆ పార్టీని ఎదుర్కొవడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లిందన్నారు. దానితోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా తమ పార్టీకే పడతాయని చెప్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తోందని ధీమా వ్యక్తం చేశారు మురళీధరరావు.
ఏపీలో కులం కార్డు ..
ఆంధ్రప్రదేశ్లో కులం కార్డు పనిచేస్తోందని వివరించారు మురళీధరరావు. కానీ తెలంగాణలో రాజకీయ సరళి వేరని చెప్పారు. ఇక్కడ కులం, మతం ఏమీ ఉండదన్నారు. అభివృద్ధి, సంక్షేమ అంశాల పనితీరును బేరిజు వేసుకొంటారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు బీజేపీకి బూస్ట్ ఇస్తాయని అంచనా వేశారు మురళీధరరావు. జమ్ముకశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా 400 సభలు పెడతామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎంపీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 17 సభలు నిర్వహిస్తామని తెలిపారు.