అక్రమ నిర్మాణాలకు అసదుద్దీన్, దాన కిషోర్ అండ.. హైకోర్టుకు ఏపీ ఎమ్మెల్సీ
హైదరాబాద్ : ఎంఐఎం లీడర్ అసదుద్దీన్ ఒవైసీతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పై ఫైర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. హైదరాబాద్ లోని తన స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే.. అడ్డుకోవాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న దానకిశోర్.. అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో హైకోర్టును ఆశ్రయించడం చర్చానీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్ రెడ్డి.. తెలంగాణకు చెందిన ఎంఐఎం లీడర్ అసదుద్దీన్ ఒవైసీతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ పై ఆరోపణలు గుప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో తనకు చెందిన స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే.. అసదుద్దీన్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ సహకరిస్తున్నారని మండిపడ్డారు దీపక్ రెడ్డి. అక్రమ నిర్మాణాలని తెలిసి కూడా జీహెచ్ఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారని.. వాటిని కూల్చివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహకారంతోనే తన స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు దీపక్ రెడ్డి. తమను అక్కడ నుంచి ఖాళీ చేయించిన జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్.. ఒవైసీతో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు సహకరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న దానకిశోర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.