మరోసారి అపూర్వ కలయిక..!జూన్ లో భేటీ కాబోతున్న జగన్, కేసీఆర్..!ఎజెండా అదేనా.?
అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని ఘట్టాలు అపురూపంగా ముద్రవేసుకుంటాయి. మరికొన్న సంఘటనలు చరిత్రాత్మకమవుతాయి. కొంత మంది రాజకీయ నేతల కలయికలకు అంతటి ప్రాధాన్యఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ సీఎం, ఏపి సీఎం ల కలయిక అపూర్వమైన గట్టంగా నిలిచిపోయింది. ఈ కలయిక మళ్లీ వచ్చే నెలలో చోటుచేసుకోబోతోంది. విద్వేషాలు, వైశమ్యాలు, ఉద్రేక పరిస్థితులు, వైరుద్యాలు వంటి పరిస్ధితుల నుండి స్నేహం చిగురించింది. అదే తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఏపి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ల మద్య ఉదయించిన స్నేహానికి నిదర్శనంగా గతంలో నాలుగు సార్లు కలుసుకున్నారు. ఇక వచ్చే నెలలో వీరి కలయిక గురించి రెండు తెలుగు రాష్టాల్లో ఆసక్తికర చర్చ మొదలైనట్టు తెలుస్తోంది.
కేసీఆర్ పై డోస్ పెంచిన విపక్షాలు..!ప్యాకేజీపై బీజేపి, ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎదురుదాడి.!
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరోసారి భేటీ.. అందరి దృష్టి తెలుగు రాష్ట్రాల పైనే..
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి, మరోసారి సంప్రదింపులు జరపకోబోతున్నారు. జూన్ నెలలో వీరిద్దరు మరోసారి భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో వీరి కలయిక పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. తాజాగా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు మిగులు నీళ్ల తరలింపు అంశం నేపథ్యంలో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. నదీజలాలే ప్రధాన అంశంగా ఇరు రాష్ట్రాల అధినేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ ముగిసిన తర్వాత వీరి సమావేశం ఉంటుందని, ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో ఈ భేటీ ఉండవచ్చని చర్చ జరుగుతోంది. దీని గురించి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ధారించాల్సి ఉంది.
కేసీఆర్, జగన్ ల మద్య ఏ అంశాలను ప్రస్తావనకు వస్తాయి...?సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు నాలుగుసార్లు సమావేశమయ్యారు. తొలిసారిగా అధికారుల బృందంతో కలిసి జూన్ 28న ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆగస్టు1న రెండో సారి, సెప్టెంబర్ 23న మూడోసారి అధికారుల బృందంతో కలిసి భేటీ అయ్యారు. ఈ ఏడాది జనవరి 13న నాలుగోసారి భేటీ అయ్యారు. ఈ సమావేశాలలో ప్రధానంగా విభజన సమస్యలు కొన్ని కొలిక్కితేవడంతో పాటు గోదావరి-కృష్ణా అనుసంధానం, విభజన చట్టంలోని 9వ, 10వ షెడ్యూల్ లోని అంశాలతో పాటు సాగు నీటిప్రాజెక్టుల పైనే ప్రధానంగా చర్చించారు. తాజాగా పోతిరెడ్డి పాడు విస్తరణకు సంబంధించి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత జగన్ తెలంగాణ సీఎంను కలిశారు. నదుల అనుసంధాన సమస్యపై గతంలో మూడుసార్లు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.
సానుకూల ధోరణిలో కేసీఆర్.. ఇక రాయలసీమ సస్యశ్యామలమేనా..?
తాజా మీడియా సమావేశంలోనూ మొత్తం కృష్ణా, గోదావరిలో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాల అవసరాల ప్రాతిపదికగా ముందుకు వెళ్తామని చంద్రశేఖర్ రావు ప్రతిపాదించారు. పోతిరెడ్డిపాడు జీవో ఆధారంగా, ప్రస్తుతం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు వివిధ వేదికలపై ఘర్శణపూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఇరువురు ముఖ్యమంత్రుల సన్నిహిత సంబంధంతోనే, స్నేహపూర్వక వాతారణంలో ఈ అంశం కొలిక్కివస్తుందని భావిస్తున్నారు. అపెక్స్ కమిటీకి వెళ్ళకుండానే పరస్పరం చర్చించుకుని సమస్య పరిష్కరించుకునే యోచనలో అధినేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే త్వరలో జరిగే సీఎంల భేటీలోనూ, పోతిరెడ్డిపాడుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో తప్పేంటి..? ప్రగతిభవన్ లో సూటిగా ప్రశ్నించిన కేసీఆర్..
మిగులు జలాలు పంపిణీ, వినియోగంపై తలెంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. గతంలో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న ప్రకటనకు కట్టుబడి ఉన్నామని, మిగులు జలాలను ఏపి ప్రభుత్వం తీసుకెళ్తే తప్పేంటని ఇటీవల ప్రగతి భవన్ లో జరిగిని మీడియా సమావేశంలో చంద్రశేఖర్ రావు బహిరంగంగా స్పష్టం చేసారు. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండకూడదా అని సూటిగా ప్రశ్నించారు. అంటే ఏపి నీటి అవసారాల అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రికి ఓ స్పష్టత ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల జూన్ లో జరగబోయే భేటీలో ప్రధానంగా ఇదే అంశం చర్చకు వచ్చే అవకాశాలున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.