ఏపీ ఓటర్ల డేటా కేసు : న్యాయమూర్తి ఎదుట ఐటీ గ్రిడ్ ఉద్యోగులు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి టెక్నాలజీ సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు కనిపించకుండా పోయిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకల్లా తమ ఎదుట వారిని హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పోలీసులు అలర్టయ్యారు. ఆ మేరకు బేగంపేట్ కుందన్ బాగ్ లోని న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహన్ నివాసంలో రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, గురుడు చంద్రశేఖర్, విక్రమ్గౌడ్ రెబ్బాలను హాజరుపరిచారు.
ఆ నలుగురిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన నేపథ్యంలో.. వారు దోషులు కాదని స్పష్టం చేశారు. వెంటనే వారిని విడిచిపెట్టాలంటూ సైబరాబాద్ పోలీసులను ఆదేశించారు. సంస్థ డైరెక్టర్ అశోక్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టివేశారు. అదలావుంటే ప్రధాన సూత్రధారైన అశోక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు స్పీడప్ చేశారు. అతడి కోసం ఐదు ప్రాంతాల్లో గాలిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో ఏపీ ఓటర్ల వివరాలు అక్రమంగా ఉన్నాయనే వివాదం తెరపైకి వచ్చింది. కూకట్ పల్లికి చెందిన డేటా అనలిస్ట్ లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఆ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంలో ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయకుండా అక్రమంగా నిర్భందించారనేది ఆ కంపెనీ డైరెక్టర్ అశోక్ వాదన. దాంతో ఆదివారం అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.