అపార్టుమెంట్లో గణేశ్ మండపం.. అగ్నికి ఆహుతైన 2 కార్లు, 10 టూ వీలర్లు..!
హైదరాబాద్ : గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేశ్ మండపాలు కొలువుదీరాయి. వాడవాడలా లంబోదరుడు ఘనంగా పూజలు అందుకుంటున్నాడు. ఆ క్రమంలో నగరాల్లోని అపార్టుమెంటుల్లో సైతం వివిధ రూపాల్లో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. అయితే మండపాలు ఏర్పాటు చేయడం ఒకటే ముఖ్యం కాదు.. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయం గుర్తు చేస్తున్నాయి కొన్ని సంఘటనలు.
మల్కాజిగిరి ప్రాంతంలోని విష్ణుపురి కాలనీలో అపశ్రుతి చోటు చేసుకుంది. మైత్రి నివాస్ అపార్టుమెంట్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో అక్కడున్న వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అపార్టుమెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.
చిన్న బండి.. పెద్ద ఫైన్.. కొత్త చట్టంతో వాహనదారుడికి ఫుల్లు జరిమానా..!
మైత్రి నివాస్ అపార్టుమెంట్లో కొలువు దీరిన గణేశ్ మండపంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో రెండు కార్లు, పది ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపంతో మంటలు వ్యాపించి క్షణాల్లో చెలరేగినట్లు తెలుస్తోంది. వాహనాలు కాలి బూడిద కావడంతో మంటల తీవ్రత అంచనా వేయొచ్చు. అయితే అపార్టుమెంట్ వాసులు అలర్ట్గా ఉండటంతో ప్రాణ నష్టం తప్పింది. ఏ కాస్తా ఏమరుపాటుగా ఉన్న పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేవారని స్థానికులు అంటున్నారు.
ఒక్కసారిగా గణేశ్ మండపంలో మంటలు చెలరేగడంతో అపార్టుమెంట్ చుట్టుపక్కల ఉండే స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో మునిగారు. అదే క్రమంలో ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు.