కొడంగల్ లో ఎన్నికల్లో పట్టుబడ్డ నగదుపై విచారణకై విజ్ఞప్తి ..దీని వెనుక రేవంత్ హస్తం ఉందా
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి దాదాపు మూడు నెలలు కావస్తుంది. అయినా కొడంగల్ పంచాయితీ మాత్రం తీరడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ నియోజకవర్గం లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకున్నారు. అయితే అప్పుడు పట్టుబడ్డ నగదుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫోరం కార్యదర్శి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.
కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, ఆయన బంధువు జగన్నాథ రెడ్డిల ఫామ్ హౌస్ లో పట్టుబడ్డ నగదుపై అటు ఆదాయపన్ను శాఖ అధికారులు, ఇటు పోలీస్ శాఖ అధికారులు వేర్వేరుగా రికార్డులు చూపడాన్ని ప్రస్తావిస్తూ ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను దీనిపై విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నారు. కోస్గి పోలీసులు ఎఫ్ఐఆర్ లో 17.50 కోట్లు సీజ్ చేసినట్లు చూపించారని, అయితే ఇన్ కమ్ టాక్స్ అధికారులు మాత్రం 51 లక్షలు మాత్రమే జప్తు చేసినట్లు ప్రకటించారని తెలిపారు. మిగతా మొత్తం 16.99 కోట్ల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేశారా లేక సంబంధిత యజమానికి అప్పగించారా అన్న అంశాలపై విచారణ జరిపించాలని పద్మనాభరెడ్డి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్ ను కోరారు.
అయితే ఎన్నికలు ముగిసిన ఇన్ని రోజుల తర్వాత ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేరుతో చేసిన ఈ విజ్ఞప్తి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ ఫిర్యాదు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా అన్న అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నేతలు. లేకుంటే ఎన్నికలు ముగిసి ఇన్ని రోజుల తరువాత ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేరుతో ఈ విషయంపై విచారణ జరిపించాలని కోరడం వల్ల ప్రయోజనం ఏమిటి అనేది అంతుచిక్కని ప్రశ్న. ఏదేమైనా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కలిగించే అంశం.