ఆరోగ్య శ్రీ సేవలు శుక్రవారం నుంచి బంద్..!
హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్ పడనుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఆ క్రమంలో శుక్రవారం (16.08.2019) నుంచి ఆరోగ్య శ్రీ సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. పాత బకాయిల చెల్లింపుపై పలుమార్లు ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ.. మాట మీద నిలబడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1500 కోట్ల రూపాయల మేర బకాయిలు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉందని.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.
ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్..!
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ వేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆపివేస్తామని ప్రకటించారు ప్రైవేట్ ఆస్పత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. హరిప్రకాశ్. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడమే దీనికి కారణమని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి 1500 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని.. ఇంతవరకు వాటిని చెల్లించకపోవడంతోనే తప్పనిపరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
పాత బకాయిలకు సంబంధించి ఇదివరకు చాలాసార్లు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయి. పలు వాయిదాలు పెట్టినా కూడా ఇంతవరకు ఇచ్చిన మాటకు కట్టుబడి లేదంటున్నారు. గురువారం నాటితో ప్రభుత్వం విధించిన గడువు మరోసారి ముగియడంతో శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు హరిప్రకాశ్.
రాజకీయ బద్ధ శత్రువులు.. ఒకే స్టేజీ మీద దర్శనం.. మంథనిలో టెన్షన్..!
2007లో ప్రారంభం.. 940 రకాల రోగాలకు కవరేజ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ స్కీమ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవల కింద ఒక్కో కుటుంబానికి దాదాపు 2 లక్షల మేర ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. వివిధ రకాలుగా మొత్తం 940 రోగాలను ఆరోగ్యశ్రీ కింద కవర్ చేస్తున్నారు. మేజర్ సర్జరీలు, దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఈ స్కీమ్ కింద వైద్య సేవలు అందుతుండటం విశేషం.
1500 కోట్ల బకాయిలు.. ఇప్పటికి పలు వాయిదాలు..!
ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు అందుతున్నాయి. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునేవారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తే రూపాయి చెల్లించనక్కర్లేదు. ఆ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం ఆయా ఆసుపత్రులకు చెల్లిస్తుంది. అయితే ఇప్పటికి అలా 1500 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. వాటిని చెల్లించడానికి ఇదివరకు పలుమార్లు గడువు పెట్టినప్పటికీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించక బకాయిలు విడుదల చేయడం లేదనే ఆరోపణలున్నాయి.
దొంగలను తరిమికొట్టిన ధైర్యం.. ఆ వృద్ధ దంపతులకు సాహస పురస్కారం (వీడియో)
ప్రభుత్వం స్పందిచడం లేదు.. అందుకే ఈ నిర్ణయం..!
ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో ప్రభుత్వంతో చాలాసార్లు సంప్రదింపులు జరిపామని చెబుతున్నారు హరిప్రకాశ్. ఆ క్రమంలో బకాయిలు విడుదల చేయక ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు గత్యంతరం లేకనే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కోట్ల రూపాయలతో కొత్త సచివాలయం, అసెంబ్లీ కట్టడానికి డబ్బులున్న ప్రభుత్వానికి.. పేదల కోసం ఉద్దేశించిన స్కీమ్కు మాత్రం డబ్బులు లేవా అంటూ ప్రశ్నించారు హరిప్రకాశ్.