అసెంబ్లీలో 40,మండలిలో 8 కొత్త సీట్లు... కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు...
ఈ నెల 7 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. పార్లమెంట్ ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పలువురు అధికారులతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు చీఫ్ విప్లు సమావేశమై చర్చించారు.
సమావేశం అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి పలు వివరాలు వెల్లడించారు. శాసనసభ,మండలిలో సభ్యుల మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం శాసనసభలో కొత్తగా 40 సీట్లు,మండలిలో కొత్తగా 8 సీట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ మార్షల్స్ రెండు రోజుల ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా నెగటివ్ సర్టిఫికెట్తో వచ్చే మంత్రులు,ఎమ్మెల్యేలకే అసెంబ్లీలోకి అనుమతి ఉంటుందన్నారు. అసెంబ్లీకి వచ్చే అధికారులు,ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తారని చెప్పారు.
Recommended Video
అసెంబ్లీకి వచ్చే మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించేలా అసెంబ్లీ సెక్రటరీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. శాఖల వారీగా అవసరం ఉన్న అధికారులు మాత్రమే సమావేశాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాసనసభ,మండలిలో రెండు చొప్పున అంబులెన్సులతో పాటు పీపీఈ కిట్లు,ర్యాపిడ్ కిట్లు,ఆక్సీ మీటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. అసెంబ్లీతో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ను జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రతీ రోజూ శానిటైజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.