జేజమ్మ గుస్సా: ఈటలకు భయపడే సీఎం మార్పుపై వెనక్కి, కేసీఆర్పై అరుణ ఫైర్
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల ఆవిర్భావం అంశం చర్చకొచ్చింది. వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే బీజేపీ నేత డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటల రాజేందర్/ సీఎం కేసీఆర్ లక్ష్యంగా కామెంట్లు చేశారు. జేజమ్మ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
ఈటల పార్టీ ఏర్పాటు..?
మంత్రి ఈటల రాజేందర్ కూడా పార్టీ పెడతారనే భయం కేసీఆర్కు ఉందని డీకే అరుణ అన్నారు. అందుకోసమే సీఎం మార్పు ప్రచారానికి తెరదించారని ఆరోపించారు. ఈటల భయంతో కేసీఆర్ వెనక్కి తగ్గారని స్పష్టంచేశారు. లేదంటే కుమారుడు కేటీఆర్ను సీఎం చేసేవారని తేల్చిచెప్పారు. కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ కలలు అంటున్నారని.. కానీ కల నెరవేరదని అరుణ అన్నారు.
హరీశ్ కాదా..?
అరుణ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. కేటీఆర్కు సీఎం పదవీ ఇస్తే ఈటల మంత్రివర్గం నుంచి వెళ్లిపోతారా అనే అంశం తెరపైకి వస్తోంది. ఆ క్రమంలోనే పార్టీ ఏర్పాటు చేస్తారని.. కొందరు నేతలు వెళ్లిపోతారని అర్థమవుతోంది. వాస్తవానికి హరీశ్ రావు నుంచి త్రెట్ ఉందని కేసీఆర్, కేటీఆర్ భావించేవారని టాక్ నడిచింది. కానీ అరుణ కామెంట్స్తో ఈటల పేరు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
క్షమాపణ చెప్పండి
మహిళలను శునకాలతో పోల్చడం దారుణమని జేజమ్మ అన్నారు. వెంటనే ఆ మహిళ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వీర్రవీగి కామెంట్ చేయడం సరికాదని.. దీంతో టీఆర్ఎస్ పతనం చెందే సమయం దగ్గరకొచ్చిందని వివరించారు. అధికార దర్పంతో చేసే వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని అరుణ చెప్పారు. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ది చెబుతారని తెలిపారు. ఇందులో సందేహినికి తావులేదని స్పష్టంచేశారు.
ఇక్కడేం పని
షర్మిల కొత్త పార్టీపై కూడా అరుణం స్పందించారు. ఆమె పార్టీ పెట్టడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు అని చెప్పారు. ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అసలు తెలంగాణలో షర్మిలకు ఏం సంబంధం అని చెప్పారు. ఏపీలో కాక తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పారు.