సారు.. కారు.. పదహారే అంటున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్స్..!
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి 16 స్థానాలను గెలుచుకుంటామంటూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతూ వచ్చారు. సారూ, పదహారూ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే పల్లవి అందుకున్నాయి. 16 సెగ్మెంట్లలో టీఆర్ఎస్ గెలుస్తుందని, ఇంకో స్థానం పరోక్ష మిత్రపక్షమైన ఎంఐఎం గెలుచుకుంటుందని కేసీఆర్ ప్రచారంలోనూ హోరెత్తించారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా కేసీఆర్ మార్క్ను ధృవీకరించేలా ఉండటం విశేషం. ఏబీపీ, వీడీపీఎ.. రెండూ సంస్థలు కూడా ఇదే విషయాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
టీఆర్ఎస్దే హవా..!
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయ దుందుభి మోగించనుంది. 17 లోక్సభ స్థానాలకు గానూ 14 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తలో ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని సీ-ఓటర్ వెల్లడించింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
16 పార్లమెంటరీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కదనరంగంలోకి దిగిన టీఆర్ఎస్ నేతల ఆశలకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొదటినుంచి కూడా 16 సెగ్మెంట్లలో కచ్చితంగా విజయకేతనం ఎగురవేస్తామని బల్లగుద్ది చెప్పారు. హైదరాబాద్ స్థానం మాత్రం ఎంఐఎంకు వదిలేశారు.
కేసీఆర్ అనుకున్న ఫలితాలే..!
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.
సంస్థ | టీఆర్ఎస్ | కాంగ్రెస్ | బీజేపీ | ఎంఐఎం |
ఏబీపీ | 16 | 0 | 0 | 1 |
వీడీపీఏ | 16 | 0 | 0 | 1 |
టుడేస్ చాణక్య | 12-16 | 0-2 | 0-2 | 0-1 |
ఇండియా టీవి | 14 | 2 | 0 | 1 |
న్యూస్ 18 | 12-14 | 1-2 | 1-2 | 1 |
ఇండియా టుడే | 10-12 | 1-3 | 1-3 | 0-1 |
లగడపాటి | 14-16 | 0-2 | 1 | 1 |
కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బే..!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కోలుకోలేని దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎగ్జిట్ పోల్స్ కూడా పెద్ద షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా కాస్తా పుంజుకున్నట్లు కనిపించినా.. తెలంగాణలో మాత్రం మళ్లీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అసెంబ్లీ ఎన్నికల నాటి మెజార్టీ ఫలితాలను రిపీట్ చేస్తూ కారు జోరు కొనసాగిందని చెప్పొచ్చు.
మొత్తం 17 స్థానాలకు గాను కనీసం ఐదారు స్థానాల్లో విజయం ఖాయమనుకున్న తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు ఇది ఊహించని పరిణామమే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమి పేరుతో టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితితో జతకట్టి ఘోరంగా దెబ్బతింది. దాంతో పార్లమెంటరీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగినా లాభం లేకపోయిందనే వాదనలు జోరందుకున్నాయి.
కాంగ్రెసోళ్లకు గులాబీ తీర్థం.. అదే ఊపు..!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఊపుతో జోరుమీదున్న టీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికల్లోనూ అదే ఊపుతో ముందుకెళ్లింది. అసెంబ్లీ ఫలితాల్లో బంపర్ మెజార్టీ సాధించడంతో కాంగ్రెస్ గూటి నుంచి గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో టీఆర్ఎస్ బలం మరింత పెరిగినట్లైంది. ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలి ఉండొచ్చనే టాక్ నడుస్తోంది.
2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 11 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్కు రెండు.. టీడీపీ, వైసీపీ, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కొక్కటి చొప్పున గెలుచుకున్నాయి. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో టీఆర్ఎస్ హవా చాటినట్లుగానే.. క్షేత్రస్థాయిలో కూడా అవే రిజల్ట్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు కొందరు.