ఏపీలో ముస్లింలు టిడిపికి ఓటు వేయరు: రేవంత్ పై కేసిఆర్ అలా..: అసద్ తేల్చేసారు..
ఏపిలో ముస్లింలు తెలుగుదేశానికి ఓటు వేయరని ఎంఐఎం అధినేత అసద్ అభిప్రాయపడ్డారు. లోక్సభ లో కాంగ్రెస్ 120 సీట్లు గెలుచుకోవటం చాలా కష్టమన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసిఆర్ వ్యూహం అద్బుతమని చెప్పుకొచ్చారు. రేవంత్ ఓడిపోతారని కెసిఆర్ ముందుగానే చెప్పారని వివరించారు. తాను 2019 ఎన్నికల్లోనూ కేసిఆర్ తోనే ఉంటానని..హంగ్ పార్ల మెంట్ ఖాయమని తేల్చేసారు. ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని విశ్లేషించారు.
రేవంత్ ఓడిపోతారని కేసిఆర్ ముందే చెప్పారు..
తెలంగాణ లోని ప్రతీ నియోజకవర్గం పై కేసిఆర్ కు మంచి పట్టు ఉందని అసద్ పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గం లో సామాజిక సమీకరణాలు..అక్కడి ఓటర్ల అవసరాల పై పూర్తి అవగాహన తో ఎన్నికలకు వెళ్లారని వివరించారు. ఫలితాల కు ముందు తాను కేసిఆర్ ను కలిసానని..అప్పుడు టిఆర్యస్ కు ఎన్ని సీట్లు వస్తాయని తనను ప్రశ్నించగా..70 సీట్ల వరకు వస్తాయని చెప్పానన్నారు. అయితే,కేసిఆర్ మాత్రం 90 సీట్ల వరకు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసారని.. అందుకు మద్దతుగా లెక్కలు సైతం వివరించారని చెప్పుకొచ్చారు. ఇక, రేవంత్ గెలుస్తాడా అని తనను ప్రశ్నిస్తే..తాను గెలవచ్చని సమాధానం ఇవ్వగా..లేదు, ఓడిపోతున్నాడని కేసిఆర్ స్పష్టంగా చెప్పిన విషయాన్ని అసద్ వివరించారు. ఇక, జానా, అరుణ, సురేఖ, పద్మావతి వంటి వారు ఓడిపోతున్న సంగత కేసిఆర్ ముందుగానే చెప్పారని..అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.
ఏపికి అప్పు కావాలి : మూడు వేల కోట్లు అత్యవసరం : 14 రోజులుగా ఓడి లో ఏపి..
కాంగ్రెస్ కు 120 సీట్లే .. ప్రాంతీయ పార్టీలదే హవా..
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను కేసిఆర్ తోనే ఉంటానని అసద్ ప్రకటించారు. కాంగ్రెస్ కు 120 సీట్లు రావాలంటే చాలా కష్టమని విశ్లేషించారు. ఈ సారి హంగ్ ఏర్పడుతుందని..ప్రాంతీయ పార్టీలదే హవా అని తేల్చేసారు. తెలంగాణ లో వచ్చే నెల నుండి లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. తాను-కేసిఆర్ ప్రచారం కోసం ఇప్పటికే కేసిఆర్ ఏయిర్క్రాఫ్ట్లను సైతం బుక్ చేసారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని ..అన్ని సీట్లు టిఆర్యస్- ఎంఐఎం గెలుస్తాయని ధీమా వ్యక్తం చేసారు. ఇద్దరం కలిసి ఫెడరల్ ఫ్రెంట్ కోసం దేశ వ్యాప్తంగా పర్యటన చేద్దామని కేసిఆర్ ప్రతిపాదించారని..అందుకు తాను సిద్దంగా ఉన్నానని అసద్ తెలిపారు.
ఏపిలో ముస్లిం ఓట్లు టిడిపికి పడవు..
తెలంగాణ ఎన్నికల ఫలితాల నుండి ఎంఐఎం అధినేత అసద్ టిడిపిని టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో టిడిపి అధి నేత చంద్రబాబు ప్రచారం చేసారని..ఏపిలో తాను ప్రచారం చేస్తానని అసద్ ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఏపి లో టిడిపికి రెండు లోక్సభ సీట్లు కూడా రావని గతంలోనే అసద్ జోస్యం చెప్పారు. ఇక, తాజాగా ఏపి రాజకీయాల పైనా స్పందించారు. ఏపిలో ముస్లింలు టిడిపికి ఓటు వేయరని తేల్చేసారు. ఏపిలో జగన్ ఈ సారి అధిక సీట్లు గెలుచుకుంటాడ ని విశ్లేషించారు. ఏపి లో తాను ఖచ్చితగా పర్యటిస్తానని అసద్ మరో సారి స్పష్టం చేసారు. ఏపిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. అక్కడ ఎన్నికల్లో ఈ సారి టిడిపికి ప్రతికూల ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు.