రంజాన్ వేళ.. ముస్లింలకు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక విజ్ఞప్తి..
రంజాన్ మాసం మొదలు కావడంతో హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు కీలక విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ను దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. ఇంటి వద్ద కూడా సామూహిక ప్రార్థనలు చేయవద్దన్నారు. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆకలితో బాధపడే పేదలను ఆదుకోవాలని... ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడమే అతిపెద్ద ధర్మమని స్పష్టం చేశారు.
లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని..లాక్ డౌన్ ముగియగానే వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే లాక్ డౌన్ తర్వాత కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించాలని.. సినిమా థియేటర్స్,మాల్స్,బహిరంగ సభలపై మాత్రం ఆంక్షలు కొనసాగించాలని చెప్పారు. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో 10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని.. కాబట్టి దాని పరిష్కారానికి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రణాళికను సిద్దం చేయాలని డిమాండ్ చేశారు.
Recommended Video
శానిటైజర్ల తయారీకి బియ్యాన్ని ఉపయోగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఖండించారు. దేశంలో 90శాతం మంది పేద,వలస కూలీలకు రేషన్ అందలేదని, 90 శాతం మందికి జీతాలు ఇవ్వలేదని ఒక సర్వే వెల్లడించిందన్నారు. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) గిడ్డంగుల్లో ఉన్న ధాన్యాన్ని పేద,వలస కూలీలకు పంపిణీ చేయాలన్నారు. కోవిడ్-19 నుంచి కోలుకున్నవారు రెడ్ క్రాస్కు రక్తదానం చేయాలని,ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా బాధితులను కాపాడేందుకు వారి రక్తం ఉపయోగపడుతుందన్నారు.