అనవసర రాద్ధాంతం: రంజాన్ మాసంలో ఎన్నికలు నిర్వహించడంలో తప్పేముంది?..అసదుద్దీన్
హైదరాబాద్: దేశంలో సార్వత్రిక ఎన్నికలను పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించడం వెనుక కుట్ర దాగి ఉందని అంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యాలను హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొట్టి పడేశారు. రంజాన్ మాసంలో ఎన్నికలను నిర్వహించడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. దీనిపై రాద్ధాంతం అనవసరమని తేల్చి చెప్పారు.
ఈ ఏడాది రంజాన్ మాసం మే 5వ తేదీన ఆరంభం అవుతుంది. జూన్ 4వ తేదీన రంజాన్ పండుగతో ముగుస్తుంది. రంజాన్ ఆరంభం అనేది చంద్రుడు కనిపించడంపై ఆధారపడి ఉంటుంది గనక.. ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చు.
రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటారని, ఆ సమయంలో వారి పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని మమతా బెనర్జీ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ముస్లిం ఓటర్ల పోలింగ్ శాతాన్ని గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతో బీజేపీ.. కేంద్ర ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ ను పున: పరిశీలించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యానాలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్లింల పోలింగ్ శాతంపై లేనిపోని ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రంజాన్ మాసంలో ముస్లింల ఓటింగ్ గతంలో కంటే బాగా పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. ముస్లీంలు, వారి మనస్తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్న వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఓవైసీ చెప్పారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుందనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఎన్నికలు కొనసాగుతున్న సమయంలో పండుగలు ఉన్నాయనే పేరుతో వాయిదా వేయడం సరికాదని కూడా ఒవైసీ అభిప్రాయపడ్డారు. రంజాన్ మాసం అయినంత మాత్రాన పొలింగ్ శాతం లో ఎటువంటి మార్పులు ఉండవని, ఇంకా పెరుగుతుందనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు. ముస్లిలందరూ ఉపవాస దీక్షలో ఉంటారని, తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పారు. ఉపవాస దీక్షలో ఉంటూ దుష్టశక్తులను ఓడించడానికి ఓటు అనే ఆయుధాన్ని వాడుతారని అన్నారు.