ఇందూరులో సీఏఏపై గళమెత్తిన అసదుద్దీన్, కేసీఆర్ ఉన్నంతవరకు టీఆర్ఎస్తోనే..
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సభలు, ర్యాలీలతో ప్రభుత్వంపై నిరసన తెలుపుతూనే ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కమల్ నాథ్, నారాయణ స్వామి మెగార్యాలీ తీశారు. ఇటు నిజామాబాద్లో మజ్లిస్ పార్టీ సభ నిర్వహించింది. టీఆర్ఎస్ సహా బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కూడా ఆహ్వానించాయి.
అసద్ నిప్పులు..
బహిరంగ సభలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీతో తమ బంధం కొనసాగుతుందని స్పష్టంచేశారు. కేసీఆర్ ఉన్నంత కాలం గులాబీ పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మిగతా పార్టీలు కలిసి రావాలని కోరారు.
విరుద్దం..
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతి పిత గాంధీ సిద్ధాంతాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తమ సభ పార్టీ కోసం కాదని, దేశం కోసం, మైనార్టీలపై జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తి నినాదిస్తున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ సభకు రావాలని కాంగ్రెస్ పార్టీని కోరినా.. టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొంటున్నందున తాము పాల్గొనబోమని ఆ పార్టీ నేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
నిరసనల వెల్లువ
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఒక్క యూపీలోనే పదుల సంఖ్యలో చనిపోయారు. 19 మంది ఆందోళనకారులు ఆసువులు బాశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. వెయ్యిమందిపై కేసులు నమోదు చేసి, ఉపేక్షించబోమని సంకేతాలు ఇచ్చింది.