మరణమృదంగానికి బాధ్యులు మీరే.. మోడీపై ఒవైసీ ధ్వజం
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు సంఖ్య పెరగడమే గాక.. మరణాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా కామెంట్స్ చేశారు.
దేశంలో కరోనా సంక్షోభం తీవ్ర రూపుదాల్చడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ప్రజలకు ఆక్సిజన్ సమకూర్చడం, వ్యాక్సిన్లు అందించడం, ప్రాణాధార ఔషధాలు, వైద్యచికిత్స వ్యవస్థలను అందుబాటులోకి తేవడం ప్రధానమంత్రి బాధ్యత అని ఒవైసీ స్పష్టం చేశారు. కానీ ప్రధాని అసమర్థత, తన విధుల పట్ల నిర్లిప్తత కారణంగా దేశంలో వేలమంది చనిపోతున్నారని విమర్శించారు. ఇదీ మీకు తగదని సునిశీతంగా వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు.
రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఆర్టికల్ 263 ప్రకారం ప్రధాని మోదీ అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఎందుకు ఏర్పాటు చేయడం లేదు.. తాత్సర్యం చేయడంలో ఆంతర్యం ఏమిటని అడిగారు. అంతర్రాష్ట్ర మండలి ద్వారా రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయానికి కృషి చేయాలని సూచించారు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు ఇంటరాక్ట్ జరిగిన ప్రయోజనం జరిగిందా అని ఒవైసీ అడిగారు.