వామ్మో.. జ్యోతిష్యుడే దొంగ.. రంగురాళ్లు అని చెప్పి.. దొంగనోట్లు చలామణి
రంగురాళ్లు దొంగతనం జరిగాయని నమోదైన కేసులో ఫిర్యాదు దారుడే నేరస్తుడని పోలీసులు తేల్చారు. నాగోల్లో వారం రోజుల క్రితం జోతిష్యుడు మురళీకృష్ణ శర్మ ఇంట్లో రూ.40 లక్షల విలువైన రంగురాళ్లు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
మురళీకృష్ణశర్మ ఇంట్లో పోలీసులు తనిఖీ చేయగా 17 కోట్ల విలువైన నకిలీ 2 వేల రూపాయల నోట్లు బయటపడ్డాయి. దీంతో రంగురాళ్ల చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. జోతిష్యుడు మురళీకృష్ణ శర్మ నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్టు గుర్తించారు. మురళీకృష్ణశర్మ గతంలో రూ. 90 కోట్ల హవాలా మనీ కేసులో జైలుకు వెళ్లివచ్చినట్లు గుర్తించారు. నిందితుడు మురళీకృష్ణ నుంచి 6 లక్షల నగదు, కారు, 10 మొబైల్స్, 17 కోట్ల 72 లక్షల నకిలీ 2వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా దొంగ నోట్లు చలామణీ చేస్తున్నట్లు గుర్తించారు. ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీగలాగితే డొంక కదిలింది. ఫిర్యాదు చేసిన జ్యోతిష్యుడు.. పెద్ద నేరస్తుడు అని తేలింది. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ వైపు కరోనా విజృంభిస్తుండగా జ్యోతిష్యుడు వ్యవహారం వెలుగుచూసింది. చుట్టుపక్కల వారు కూడా నోరెళ్లబెట్టారు. తమకు తెలియదని వారు చెబుతున్నారు. పైకి మంత్రాలు చదువుతూ.. లోన మాత్రం దొంగనోట్లు చలామణి చేస్తున్నారు. మరీ ఆ రంగురాళ్లు ఏమయ్యాయో తెలియాల్సి ఉంది. అతనే దాచిపెట్టాడా.. ? లేక మరెవరైనా తీశారా అనే అంశం విచారణలో తెలియనుంది.