మంత్రి పదవులకు జాతకాలతో లింక్? కుదరకుంటే పదవి యోగం లేనట్టేనా?
హైదరాబాద్ : సాధారణంగా జాతకాలు ఎప్పుడు చూయిస్తాం. గృహప్రవేశాలకో లేదంటే పెళ్లిళ్లకో చూపిస్తుంటాం. ఇక వ్యాపారాలు ప్రారంభించే ముందు గానీ, భాగస్వామ్య కంపెనీలు కలిసొస్తాయో లేదోనని ఇలా పలు రకాలుగా జ్యోతిష్యం చూయించుకోవడం ఆనవాయితీ. మరి ప్రభుత్వ పెద్దలు కూడా జాతకాలు నమ్ముతారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ మంత్రుల పదవుల పంపకంలో.. జాతకాలే పెద్దపాత్ర పోషిస్తున్నాయనేది చర్చానీయాంశంగా మారింది.
50 రోజులు.. ఊసే లేని మంత్రివర్గ విస్తరణ
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న వెలువడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమినిస్టర్ గా మహమూద్ అలీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మరి మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యమవుతుందనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. వివిధ కారణాలతో వాయిదాపడుతూ వస్తోంది. అదలావుంటే కేబినెట్ విస్తరణపై సీఎం కేసీఆర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 50 రోజులవుతోంది. ఇంతవరకు మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనెల 30 లేదా 31వ తేదీన కేబినెట్ విస్తరణకు ఛాన్సుందని, లేనిపక్షంలో ఫిబ్రవరి 7న ముహుర్తం కుదిరే ఛాన్సుందనే టాక్ నడుస్తోంది.
ఓడిపోయాం, మా పైసలు మాకివ్వండి : తెలంగాణలో కొత్త ' పంచాయితీ '
కుదిరితేనే మంత్రి కొలువు..!
మంత్రివర్గ విస్తరణ ఆలస్యం జరుగుతుండటంతో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. సోమవారం నాడు ఓ టీవి ఛానల్ డిస్కషన్ లో మాట్లాడిన బీజేపీ నేతలు.. జాతకాల మూలంగా కేబినెట్ విస్తరణలో ఆలస్యం జరుగుతోందంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కొక్కరి జాతకం చూసుకుంటూ మంత్రి పదవులు ఇస్తారనే వాదన హాట్ టాపికయింది. కాంగ్రెస్ పార్టీతో పాటు టీజేఎస్ లీడర్లు కూడా బీజేపీ నేతల కామెంట్లకు మద్దతుగా మాట్లాడటం చర్చానీయాంశంగా మారింది. అయితే టీఆర్ఎస్ నేతలు ఆ విషయాన్ని ఖండించనప్పటికీ, ప్రజా ఆమోద్యయోగ్యమైన మంత్రులే కొలువుదీరుతారని చెప్పుకొచ్చారు.
ఛాన్స్ దొరికేనా? బెర్త్ దక్కేనా?
జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్.. తాజాగా మంత్రివర్గ విస్తరణకు ఆయా నేతల జాతకాలను జోడిస్తున్నారనేది బీజేపీ నేతల వాదన. అదలావుంటే మంత్రివర్గంలోకి తీసుకునే నేతల జాతకాలను సీఎం కేసీఆర్ ఓ పండితుడి దగ్గర చూపిస్తున్నారట. ఒక్కో దగ్గర ఒక్కో తీరు చెప్పే జాతకాలతో నేతల భవితవ్యం ఎలా మారబోతుందో చూడాలి. అదలావుంటే మంత్రి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కొందరు నేతలను ఈ జాతకం భయం వెంటాడుతోందట.
రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెడతానంటున్న సీఎం కేసీఆర్.. అందులోభాగంగా ప్రభుత్వం మరింత పటిష్టంగా ఉండేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే జాతకాలు కుదిరి బెర్త్ దక్కుతుందో లేదో అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారట.