పరువే ముఖ్యం.. తలదించుకోవాల్సి వచ్చింది... అందుకే హేమంత్ హత్య : విచారణలో అవంతి తండ్రి
హేమంత్ హత్య కేసులో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపెట్టాడు. హేమంత్తో ప్రేమ వ్యవహారం గురించి తెలిశాక అవంతిని ఇంట్లోనే కట్టడి చేశామని లక్ష్మారెడ్డి పోలీసులతో చెప్పాడు. అయినప్పటికీ అవంతి ఇంటి నుంచి పారిపోయి హేమంత్ను ప్రేమ వివాహం చేసుకుందన్నాడు.
అవంతి ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసుల నుంచి తమకు సమాచారం వచ్చినట్లు చెప్పాడు. నిజానికి తన బామ్మర్ది యుగేంధర్ రెడ్డితో 15 ఏళ్లుగా తనకు మాటలు లేవని... కానీ అవంతి విషయంలో అతనితో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నాడు. తమది ప్రాణం కంటే పరువే ఎక్కువని భావించే కుటుంబమని... తమ కాలనీలో తమదే ఆధిపత్యమని చెప్పాడు. అవంతి ప్రేమ వ్యవహారంతో కాలనీలో తాము తలదించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
హేమంత్ కేసులో నిందితులైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు బుధవారం(సెప్టెంబర్ 30) కస్టడీలోకి తీసుకున్నారు. ఆరు రోజుల విచారణలో భాగంగా నేడు తొలిరోజు విచారణ ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. . హేమంత్ను కిడ్నాప్ చేసిన గోపన్ పల్లి నుంచి సంగారెడ్డిలో హత్యా స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు లక్ష్మారెడ్డి,యుగేంధర్ రెడ్డి అని పోలీసులు ఇప్పటికే నిర్దారించారు. ఇప్పటివరకూ ఈ కేసులో 21 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
హేమంత్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని అతని భార్య అవంతి డిమాండ్ చేస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని సీపీ సజ్జనార్కు అవంతి విన్నవించడంతో హేమంత్ ఇంటి వద్ద 24గంటల పోలీస్ భద్రతకు ఆయన చందానగర్ పోలీసులను ఆదేశించారు. అటు లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కూడా 24గంటలు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.