Ayodhya verdict: హైదరాబాద్ లో హై అలెర్ట్ ...అప్రమత్తమైన తెలంగాణా పోలీసు యంత్రాంగం
అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో దేశం మొత్తం అప్రమత్తమైంది. ఇక దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాకట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం . సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి భద్రత పెంచింది. ఎక్కడా మత విద్వేషాలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఇదే క్రమంలో తెలంగాణా రాష్ట్రంలోనూ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరబాద్ లో హై అలెర్ట్ ప్రకటించి భద్రత చేపట్టారు.
అయోద్య తీర్పు: పినరయి శాంతి మంత్రం, ఆ క్రెడిట్ సుప్రీంకేనన్న శివసేన.. బెంగళూరులో ఆంక్షలు
అయోధ్య తీర్పు .. తెలంగాణా పోలీసు యంత్రాంగం అప్రమత్తం
అయోధ్య తీర్పు నేడు రానున్న నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రంలో ఎలాంటి మత విద్వేషాలకు , ఘర్షణలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. అయోధ్య తీర్పు నేపథ్యంలో అప్రమత్తం అయిన పోలీసులు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయం పంపిన ఆదేశాల మేరకు భద్రతా చర్యల్లో నిమగ్నం అయ్యారు. అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని పీస్ కమిటీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించి ఎలాంటి హడావిడి లేకుండా అంతా ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు.
రంగంలోకి 54 వేల మంది సిబ్బంది
తీర్పు ఎలా వచ్చినా గౌరవించాల్సిందేనని అన్ని వర్గాలకు స్పష్టం చేశారు. ఇక అంతే కాదు మత విద్వేషాలకు , ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కావద్దని సూచించారు. కొందరు నేరచరిత ఉన్నవారిపై, అలాగే ఘర్షణలకు పాల్పడతారు అన్న అనుమానాలు ఉన్న వారిపై నిఘా పెంచారు. కొన్ని ప్రాంతాల్లో పికెటింగ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు తన వద్ద సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీలో ఉన్న మొత్తం 54 వేల మంది సిబ్బందిని శాంతి భద్రతల పరిరక్షణ కోసం వినియోగించనుంది.
హైదరాబాద్ లో హై అలెర్ట్.. పటిష్టమైన భద్రత
దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా, బాంబు పేలుళ్లు జరిగినా హైదరాబాద్ లో ఆ ఘటనకు సంబంధించిన మూలాలు ఉంటాయని ఇప్పటికే పలు ఘటనలు తేటతెల్లం చేశాయి. ఇక ఈ నేపధ్యంలో చారిత్రాత్మక తీర్పు అయోధ్యపై రానున్న తరుణంలో హైదరాబాద్ లో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ భద్రత పెంచారు. ముఖ్యంగా పాత బస్తీలో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాత ఉమ్మడి 10 జిల్లా కేంద్రాల్లోనూ ప్రత్యేక నిఘా పెట్టారు తెలంగాణా పోలీసులు . మరీ ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్,నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి.
జిల్లాల వారీగా నిఘా వర్గాలు .. విజయోత్సవాలు, నిరసనల ర్యాలీలకు నో ఛాన్స్
జిల్లాల వారీగా పాత రౌడీ షీటర్లను పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే సున్నితమైన అయోధ్య కేసు తీర్పు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించకుండా అటు హిందూ సఘాలను, ఇటు ముస్లిం సంఘాలను హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణాలోని జిల్లాల్లో ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐ ర్యాంకు అధికారి వరకు వివిధ వర్గాలతో సమావేశాల్లో నిమగ్నమయ్యారు. న్యాయస్థానం తీర్పును అంతా గౌరవించాలని సూచిస్తున్నారు. విజయోత్సవాలు, నిరసనల ర్యాలీలు వేటికీ అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు. ఎక్కడా చిన్న హింసాత్మక ఘటన కూడా జరగకుండా తగు చర్యలు చేపడుతున్నారు.