టీవీ9పై కేసు నమోదు: ఈ సారి విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఎంట్రీ
హైదరాబాద్: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 యాజమాన్యంపై తాజాగా మరో కేసు నమోదైంది. బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆ ఛానల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీశారనే కారణంతో ఈ రెండు సంస్థల నాయకులు పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. దీపావళి పండుగ నాడు బాణాసంచాలను కాల్చే వారు గాడిదలతో సమానమంటూ హిందువులను కించపరిచారని వారు ఫిర్యాదులో పొందుపరిచారు.
దీపావళి రోజు క్రాకర్స్ కాల్చే వారు గాడిదలు అనే శీర్షికన టీవీ9 యాజమాన్యం ఇటీవలే ఓ యాడ్ క్యాంపెయిన్ ను రూపొందించింది. దాన్ని తన ఛానల్ లో ప్రసారం చేస్తోంది. పర్యావరణానికి హాని కలిగించే బాణాసంచాలను కాల్చ కూడదనేది ఆ యాడ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని బాణాసంచా కాల్చే వారిని గాడిదలో పోల్చుతూ ఈ యాడ్ ను రూపొందించింది. దీనిపై భారతీయ జనతాపార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ టీవీ9 యాజమాన్యంపై విమర్శలు చేశారు.
యాడ్ క్యాంపెయిన్ ను నిలిపివేయాలంటూ వీహెచ్ పీ, బజరంగ్ దళ్ సంస్థల ప్రతినిధులు టీవీ9 యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ- వినిపించుకోలేకపోవడంతో తాము పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. విశ్వహిందూ పరిషత్ హిందీ నగర్ జిల్లా సహ కార్యదర్శి ఎం కిరణ్ కుమార్, విశ్వహిందూ పరిషత్-బజరంగ్ దళ్ జిల్లా ధర్మ ప్రసార ప్రముఖ్ ఎస్ మహేష్ యాదవ్, బజరంగ్ దళ్ ఖైరతాబాద్ అఖాడా ప్రముఖ్ వై కిశోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
టీవీ9 యాజమాన్యం ఉద్దేశపూరకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని వారు ఆరోపించారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించిందని విమర్శించారు. దీపావళి నాడు బాణాసంచాను కాల్చే వారందరూ గాడిదలేనంటూ హైందవ సమాజాన్ని కించపరిచిందని అన్నారు. గతంలోనూ ఆ ఛానెల్ లో నిర్వహించిన డిబేట్లలో హిందువులకు వ్యతిరేకంగా చర్చలు కొనసాగించిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. హిందువులు, వారు నిర్వహించుకునే పండుగలను విమర్శిస్తూ ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకుండా సంబంధిత ఛానెల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.