వైఎస్ జగన్ నివాసం ముట్టడి: జైశ్రీరామ్ నినాదాలు: భారీగా అరెస్టులు.. ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్ లోటస్పాండ్ వద్ద గల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని బజరంగ్దళ్ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించడానికి వైఎస్ జగన్ తిరుమల వెళ్లబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బజరంగ్దళ్ నాయకులు ఆయన నివాసాన్ని ముట్టడించారు. అన్యమతస్తుడైన వైఎస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే శ్రీవారి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ఆందోళనను నిర్వహించారు.
Recommended Video
లోటస్ పాండ్ ఇళ్లు ముట్టడి..
కాషాయ జెండాలను భుజాన మోస్తూ పెద్ద సంఖ్యలో బజరంగ్దళ్ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా లోటస్పాండ్ నివాసానికి చేరుకున్నారు. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే బైఠాయించారు. ముఖ్యమంత్రి హిందూ వ్యతిరేకి అంటూ నినదించారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే పెద్ద ఎత్తున హిందుత్వంపై దాడులు ఆరంభం అయ్యాయని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం దగ్ధం కావడానికి జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
హిందూ దేవాలయాలపై దాడులకు కారణం..
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మూడు సింహాల వెండి ప్రతిమలు మాయం కావడం హిందూ ఆలయాలపై జగన్ ప్రభుత్వం చేస్తోన్న దాడులకు పరాకాష్టగా మారిందని ఆరోపించారు. ఏపీలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని, తరచూ హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసమౌతోంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. హిందూ ఆలయాలను పరిరక్షించడానికి వెంటనే కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని వారు బజరంగ్దళ్ నాయకులు డిమాండ్ చేశారు.
డిక్లరేషన్ ఇస్తేనే..
కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆనవాయితీని వస్తోన్న డిక్లరేషన్ విధానాన్ని పక్కనపెట్టడం సమంజసం కాదని అన్నారు. క్రమంగా ఒక్కో నిబంధనను ఎత్తేసేలా జగన్ సర్కార్ ప్రవర్తిస్తోందని, దాన్ని కొనసాగనివ్వబోమని వారు హెచ్చరించారు. డిక్లరేషన్పై సంతకం చేసిన తరువాతే జగన్.. శ్రీవారిని దర్శించుకోవాలని, అలా చేయకపోతే.. ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమాలను లేవదీస్తామని అన్నారు. తదనంతరం చోటు చేసుకునే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.
భారీ భద్రత..
వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు పట్టుబట్టారు. ఇందులో భాగంగా బజరంగ్దళ్ నేతలు, కార్యకర్తలు.. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్ జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లోటస్పాండ్ నివాసం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. లోటస్పాండ్ నివాసానికి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. బ్యారికేడ్లను అమర్చారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బజరంగ్దళ్ నాయకులను అరెస్టు చేసి, ప్రత్యేక వాహనాల్లో వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు.