హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు ఎక్కడంటే..!
హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. సోమవారం (12.08.2019) నాడు ప్రత్యేక ప్రార్థనలు పురస్కరించుకుని వివిధ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది. ఆ మేరకు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు దాదాపు మూడున్నర గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాసబ్ట్యాంక్, లంగర్హౌజ్, మిరాలం ట్యాంక్, హాకీ గ్రౌండ్ లాంటి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు ఉంటుందని, ప్రజలు సహకరించాలని కోరారు సీపీ.
హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
బక్రీద్ (ఈద్-ఉల్-జుహ) ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా సోమవారం (12.08.2019) నాడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. బక్రీద్ పర్వదినం సందర్భంగా నగరంలోని పలుచోట్ల ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఆ క్రమంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉదయం మూడున్నర గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
సీఎం కేసీఆర్ చెప్పింది ఇలా అర్థమైందా.. మొక్కలు నాటమంటే ఏం చేశారో తెలుసా..! (వీడియో)
మాసబ్ ట్యాంక్ ఏరియాలో ఇలా
మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్లో ప్రార్ధనలు జరగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు ఇలా ఉండనుంది. మెహిదీపట్నం నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 లోకి వెళ్లే వాహనాలను.. మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్, అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్ మీదుగా తాజ్కృష్ణా హోటల్ రూట్లో మళ్లిస్తారు. రోడ్డు నంబర్ 12 నుంచి బంజారాహిల్స్ మీదుగా మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే బస్సులను 1/12 జంక్షన్ నుంచి తాజ్ కృష్ణ, ఖైరతాబాద్ మార్గంలో మళ్లిస్తారు.
ఇక లక్డీకపూల్ వైపు నుంచి 1/12 జంక్షన్ రూట్లో వెళ్లే వాహనాలను బంజారాహిల్స్ వైపు.. మాసబ్ట్యాంక్ మీదుగా అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, తాజ్కృష్ణ రూట్లో మళ్లిస్తారు. మాసబ్ట్యాంక్ ఫ్లై ఓవర్ కింది మార్గంలో ఎలాంటి వాహనాలను అనుమతించరు. ఇక సాధారణ వాహనాలను 1/12 జంక్షన్ నుంచి చింతల్ బస్తీ దారిలో మళ్లిస్తారు.
లంగర్హౌజ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు ఈవిధంగా..!
లంగర్హౌజ్ ఏరియాలో ట్రాఫిక్ మళ్లింపు ఇలా ఉండనుంది. నానల్నగర్ నుంచి నుంచి ఆంధ్ర ఫ్లోర్ మిల్స్ వైపు వెళ్లే వాహనాలను బాలిక భవన్ జంక్షన్ నుంచి లక్ష్మి నగర్ వైపు మళ్లిస్తారు. ఎండీ లైన్స్, బాలిక భవన్ వైపు నుంచి వచ్చే వాహనాలను మిలిటరీ దవాఖాన వైపు అనుమతించరు, ఈ రూట్లో వచ్చే వాహనాలను ఆంధ్ర ఫ్లోర్ మిల్ వద్ద బాలిక భావన్ వద్ద మళ్లిస్తారు.లంగర్ హౌజ్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను మిలిటరీ దవాఖాన వైపు అనుమతించరు, ఈ వాహనాలను మొఘల్ కా నాలా వైపు మళ్లిస్తారు.
మిరాలం ట్యాంక్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆ ఏరియాలో ఇలా..!
మిరాలం ట్యాంక్ ఈద్గా దగ్గర జరగనున్న ప్రార్థనలతో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉండనున్నాయి. అక్కడకు ప్రార్ధనల కోసం వచ్చే ముస్లిం సోదరులు పురానాపూల్, కామటిపురా, కిషన్బాగ్, బహదూర్పురా క్రాస్ రోడ్డు మీదుగా రావాలని పోలీసులు కోరారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్యలో ఈ రూట్లలో రావాలని సూచించారు. ఈ వాహనాలను జూపార్కు ప్రాంతంలో పార్కు చేయాలని కోరారు. ఇతర ప్రయాణీకులకు ఈద్గా రోడ్డు వైపు అనుమతి లేదు. వాళ్లు బహదూర్పురా క్రాస్ రోడ్డు దగ్గర్నుంచి కిషన్బాగ్, కామటిపూరా వైపు వెళ్లాలి.
శివరాంపల్లి వైపు నుంచి ప్రార్ధనల కోసం వచ్చే ముస్లిం సోదరులను దానమ్మ క్రాస్ రోడ్డు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ సమయంలో ఇతర వాహనదారులను ఈద్గా వైపు అనుమతించబోరు, దానమ్మ క్రాస్రోడ్స్ నుంచి శాస్త్రిపురం, ఎన్ఎస్కుంట మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇక వాహనాల పార్కింగ్ విషయానికొస్తే.. యూసుఫ్ పార్కింగ్, మజార్ పార్కింగ్, జయేష్ పార్కింగ్, మెడ్రన్ సా మిల్ పార్కింగ్ స్థలాలతో పాటు ఈద్గా ఎదుట ఉన్న ప్రధాన రోడ్డు, మిర్ అలామ్ ఫిల్టర్ బెడ్, యాదవ్ పార్కింగ్ స్థలాలలో వాహనాలు పార్కు చేయాల్సి ఉంటుంది.
హరీశ్ రావు కొత్త స్కెచ్.. ఆ ఇలాకాలో అలా.. అక్కడే ఎక్కువగా ఎందుకో తెలుసా?
కాలా పత్తార్ ప్రాంతంలో ఈవిధంగా..!
కాలా పత్తార్ నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను, ముస్లిం సోదరులను కాలా పత్తార్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి ఉదయం 8 నుంచి 11.30 వరకు అనుమతిస్తారు, సాధారణ వాహనాలను మోచీ కాలనీ, బహదూర్పురా వైపు మళ్లిస్తారు. ఈ మార్గంలో వచ్చే వాహనాలు భయ్యా పార్కింగ్, మెడ్రన్ పెట్రోల్ బంక్, బీఎన్కే కాలనీలో పార్కు చేయాలి. అదలావుంటే ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పురానాపూల్ నుంచి బహదూర్పురా వైపు వెళ్లే భారీ వాహనాలను జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్, రాజేంద్రనగర్ వైపు నుంచి బహదూర్పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్ జంక్షన్ నుంచి మళ్లిస్తారు.