బల్దియా అదికారుల లీలలు..! నకిలి సిబ్బందిని సృష్టించి నిధుల దోపిడి..!!
హైదరాబాద్: కాదేదీ మోసానికి అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు బల్దియా అదికారులు. ఐదు నెలల క్రితం బల్దియాలో కలకలం రేపిన నకిలీ వేలి ముద్రల కేసు అటకెక్కింది. 84 మంది కార్మికుల నకిలీ వేలి ముద్రలతో నిధులు బొక్కేస్తూ సిబ్బంది అడ్డంగాదొరికితే... విజిలెన్స్ అధికారులు కేసు విచారణను వారి వరకే పరిమితం చేసి చాప చుట్టేశారు. ఫలితంగా సింథటిక్ వేలిముద్రలతయారీ,వాటిని ఉపయోగించి ప్రజాధనాన్ని దోచుకుంటున్న పలువురు సహాయ వైద్యాధికారులు (ఏఎంవోహెచ్), ఉప కమిషనర్లు ఒడ్డున పడినట్లయింది. ఇందుకు ఏఎంవోహెచ్లు భారీగా విచారణ అధికారికి డబ్బు ఇచ్చారనే విమర్శలొస్తున్నాయి. పాతబస్తీకి చెందిన నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కేసు, శ్రీనగర్కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత తదితర కేసుల్లో విజిలెన్స్ అధికారులు వ్యవహరించిన తీరు అందుకు బలం చేకూరుస్తోంది.
దొంగలను వదిలేశారు..! నకిలీ వేలుముద్రలతో ఖజానాను దోచుకున్నారు..!!
నకిలీ సిబ్బంది పేర్లతో..: జీహెచ్ఎంసీ పరిధిలో 18 వేలకుపైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు 14,500 రూపాయల జీతం వస్తోంది. వాళ్లంతా గతంలో రిజిస్టరులో సంతకం చేసి జీతం తీసుకునేవారు. కొందరు ఎస్ఎఫ్ఏలు (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు) , ఏఎంవోహెచ్లు, డీసీలు నకిలీ పేర్లను రిజిస్టరులో నమోదు చేసేవారు. ఆ పేర్లతో జీతాలు కాజేసేవారు. దానికి విరుగుడుగా యంత్రాంగం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తెరపైకి తెచ్చింది. మొదట్లో ఈ విధానంతో పారదర్శకత పెరిగిందనే అభిప్రాయం అంతటా వ్యక్తమైంది. గతంలో నకిలీ సిబ్బంది పేరుతో నిధులు కొల్లగొట్టిన ఉద్యోగులకు.. నకిలీ వేలి ముద్రలు సృష్టించడం కష్టంకాలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. జనవరి ఆఖరులో విజిలెన్స్ విభాగం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడంతో వాస్తవాలు బట్టబయలయ్యాయి. తొమ్మిది మంది సిబ్బంది దగ్గర 84 మంది కార్మికుల సింథటిక్ వేలి ముద్రలు లభ్యమయ్యాయి. కమిషనర్ వారందరినీ వెంటనే విధుల్లోంచి తొలగించారు.
నకిలీ వేలిముద్రలు సృష్టించిన ఎస్ఎఫ్ఏలు..! ఏఎంవోహెచ్ల ముడుపులతో విచారణ పక్కదారి..!!
చనిపోయిన ఓ వ్యక్తికి ఆజంపుర డివిజన్ అధికారి రెండు తేదీల్లో మరణ ధ్రువీకరణపత్రం జారీ చేశారు. దానిపై కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ చేయకుండా ఆ అధికారి రెండు తేదీలను వేసి ధ్రువీకరణపత్రం ఇచ్చారని ఏఎంవోహెచ్ విజిలెన్స్ విభాగానికి స్పష్టంగా లేఖ రాశారు. కేసును పక్కదారి పట్టించేందుకు... జనన, మరణ ధ్రువీకరణ విభాగాన్ని పదేపదే వివరణ కోరుతూ విజిలెన్స్ అధికారి కాలక్షేపం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
లంచాలకు మరిగిన సిబ్బంది..! ఏ చిన్న పనిచేసినా సమర్పించుకోవాల్సిందే..!!
శ్రీనగర్కాలనీలోని ఓ అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు వెళ్లిన సందర్భంలోనూ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు యజమాని నుంచి ముడుపులు తీసుకున్నారనే ఫిర్యాదులున్నాయి. తాజాగా.. ఈ విభాగంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు జీహెచ్ఎంసీలోని ఓ అధికారికి ఫోన్ చేసి మీ ఆధ్వర్యంలో అవినీతి జరిగిందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విజిలెన్స్ సిబ్బంది కొందరు తమ వద్ద డిమాండ్ చేసి మరీ... కూపన్లు తీసుకొంటున్నారని జీహెచ్ఎంసీ మున్సిపల్ మార్కెట్లు, కాంప్లెక్సుల్లోని పెద్దపెద్ద దుకాణాల నిర్వాహకులు వాపోతున్నారు. ఎంతో కీలకంగా వ్యవహరించాల్సిన విజిలెన్స్ విభాగం పనితీరు.. లక్ష్యానికి దూరంగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి.
ఆరంభంలోనే హడావుడి..! తర్వాత చేతులెత్తేస్తున్న ఉన్నతాదికారులు..!!
'చార్మినార్, మలక్పేట, మూసాపేట, ఎల్బీనగర్, కూకట్పల్లి, సంతోష్నగర్ సర్కిళ్ల పరిధిలో తనిఖీలు నిర్వహించి అవినీతి ఎస్ఎఫ్ఏలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై చర్యలు తీసుకున్నాక విజిలెన్స్ విచారణ మొదలైంది. అప్పుడే కేసును పక్కదారి పట్టించేందుకు బీజం పడింది. ఎస్ఎఫ్ఏల నుంచి నెలవారీగా మామూళ్లు తీసుకునే ఏఎంవోహెచ్లు, పలువురు కార్పొరేటర్లు, ఉప కమిషనర్లు రంగంలోకి దిగారు. విచారణ అధికారితో సంప్రదింపులు సాగించారు. ఆ అధికారి కొద్దిరోజులపాటు అధికారులకు, సిబ్బందికి చెమటలు పట్టించారు. విచారణ సందర్భంగా ఎస్ఎఫ్ఏలు చెప్పిన కార్పొరేటర్లు, అధికారుల పేర్లను ప్రస్తావించి భయాందోళనకు గురి చేశారు. నెలవారీ మామూళ్లు వసూలు చేయడమేమిటని వాట్సప్ గ్రూపుల్లో మరీ ప్రశ్నించారు. అనంతరం బేరసారాలు మొదలయ్యాయి. దొరికిపోయిన సిబ్బంది వరకే కేసు విచారణ పరిమితమైంది' అని ఓ సీనియర్ ఉన్నతాధికారి తెలిపారు. అందుకు ఒక్కో ఏఎంవోహెచ్ సుమారు 50 వేల రూపాయలు సమర్పించుకున్నట్లు సమాచారం.