నమ్మించి ముంచారు.. నకిలీ బంగారంతో 13 లక్షలకు టోకరా.. మూడో కంటితో గుట్టురట్టు
హైదరాబాద్ : కష్టపడితే ఎదగడం చాలాకష్టమనుకుంటున్నారు కొందరు. ఈజీమనీతో లైఫ్ లో ఈజీగా సెటిలైపోదామని కలలు కంటున్నారు. దీంతో నేరాల బాట పడుతున్నారు. అయితే కొన్నిసార్లు వీరి స్కెచ్చులు వర్కవటవుతున్నా.. కొన్ని సందర్భాల్లో సీన్ రివర్సవుతోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే.. ఇత్తడిని బంగారంగా నమ్మించి 13 లక్షల రూపాయల నగదు కాజేసింది ఓ ముఠా. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు మొదలుపెట్టిన బాలాపూర్ పోలీసులు ఈ ముఠా గుట్టురట్టు చేశారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
నెలరోజుల కిందట బడంగ్ పేట పరిధిలోని సుల్తాన్ పూర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డిని బళ్లారికి చెందిన ముఠా సభ్యులు ముగ్గులోకి దించారు. తక్కువ ధరకే 3 కిలోల బంగారం ఇస్తామంటూ కల్లిబొల్లి మాటలు చెప్పారు. వారి మాయమాటల్ని గుడ్డిగా నమ్మిన శ్రీనివాస్ రెడ్డి 13 లక్షల రూపాయల నగదు ఇచ్చారు. దీంతో ఈ ముఠా ఆయనకు నకిలీ గోల్డ్ అందించారు. అయితే ఆ బంగారం నకిలీదని, తాను మోసపోయానని గుర్తించిన శ్రీనివాస్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు.
ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు.. ఈ ముఠా సభ్యుల తీరు, వారి కారును పసిగట్టారు. దీంతో రంగంలోకి దిగి బళ్లారికి వెళ్లి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 6 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.