దత్తాత్రేయ ప్రస్థానం: రోహిత్ ఆత్మహత్యతో ఆరోపణలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి గవర్నర్ వరకు
హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీలో చేరి కీలక పదవులు చేపట్టారు. తాజాగా, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా నియమించింది.
తెలంగాణ కొత్త గవర్నర్గా సౌందర రాజన్, హిమాచల్కు దత్తాత్రేయ
ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా..
బండారు దత్తాత్రేయ జూన్ 12, 1946లో జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా పొందారు. 1965లోనే ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా చేరారు. 1968-89 వరకు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేశారు. ఆ తర్వాత 1980లో బీజేపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
కేంద్రమంత్రిగా..
1991-2004 మధ్య కాలంలో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. మొదట అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ సర్కారులో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ ఆయన కేంద్రమంత్రి పనిచేశారు.
పదవి పోవడంతో..
అయితే, కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలో దత్తాత్రేయ తన పదవిని కోల్పోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ టికెట్ను కూడా దత్తాత్రేయకు కేటాయించలేదు. దీంతో దత్తాత్రేయకు మరేదైనా కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బండారు దత్తాత్రేయను హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో బీజేపీలో కీలక నేతగా మారిన ఆయనకు సముచిత స్థానం ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రోహిత్ వేముల ఆత్మహత్య.. దత్తాత్రేయపై కేసు
కాగా, రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ అన్ని పార్టీల నేతలతో బండారు దత్తాత్రేయ స్నేహపూర్వకంగానే ఉంటారు. ఆయనపై ఎలాంటి వివాదాలు లేవు. అయితే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సమయంలో దత్తాత్రేయపై పలు ఆరోపణలు వచ్చాయి. కుల రాజకీయాలకు, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు హెచ్సీయూ కేంద్రంగా మారిందని పేర్కొంటూ అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి దత్తాత్రేయ లేఖ రాయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంతో అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయపై కేసు నమోదైంది.