ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎస్ఈసీ.., బీజేపీ రౌడీయిజం చేస్తే బట్టలిప్పి కొడుతారు... : బండి సంజయ్
టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ప్లాన్ ప్రకారమే... వరుసగా 4 రోజులుగా సెలవులు వచ్చిన సందర్భంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. నిజానికి సంక్రాంతికి ఎన్నికలు నిర్వహించాలని మొదట భావించారని చెప్పారు. సంక్రాంతి సమయంలో అయితే సీమాంధ్ర ప్రజలు,తెలంగాణ ప్రజలు గ్రామాలకు వెళ్లిపోతారు కాబట్టి... మిగిలినవాళ్లను ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో గెలవొచ్చునని టీఆర్ఎస్ భావించిందన్నారు. కానీ దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్,ఓవైసీ,ఎన్నికల కమిషన్ కలిసి ప్లాన్ మార్చారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎస్ఈసీ : బండి సంజయ్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలని తాము భావించామని.. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికల కమిషన్,ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఓటింగ్ శాతాన్ని తగ్గించాయన్నారు. బీజేపీ మతం పేరుతో విద్వేషాలు రగిలిస్తున్నదని పదేపదే ఆరోపణలు చేసి ఎన్నికలు వాయిదా వేయాలని కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజలు ఓటింగ్లో పాల్గొనకుండా భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని... ఎస్ఈసీకి హ్యాట్సాఫ్ చెప్తున్నామని ఎద్దేవా చేశారు.
ప్లాన్ ప్రకారమే..
తెలంగాణ ప్రజలు ఎలాగు ఓట్లు వేయరు... సీమాంధ్ర ప్రజలు కూడా ఓటేయరని భావించే... ప్లాన్ ప్రకారం... వరుసగా 4 రోజులు సెలవులు వచ్చిన సందర్భంలో ఎన్నికలు నిర్వహించారని బండి సంజయ్ ఆరోపించారు. కొంతమంది మేదావులు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో టీచర్లను విధుల్లోకి తీసుకోలేదని... కేసీఆర్కు వారి పట్ల ఎందుకు నమ్మం కాలేదో అర్థం కావట్లేదని అన్నారు. అనుభవం లేని వ్యక్తులకు,తమకు అనుకూలమైన వ్యక్తులను ఎన్నికల డ్యూటీ వేశారని ఆరోపించారు.
Recommended Video
బీజేపీ రౌడీయిజం చేస్తే...
టీఆర్ఎస్ అరాచకాలను అడుగడుగునా బీజేపీ కార్యకర్తలు సాహసోపేతంగా అడ్డుకున్నారని బండి సంజయ్ అన్నారు. అనేక ప్రాంతాల్లో స్వయంగా ఎమ్మెల్యేలే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. కూకట్పల్లిలో వినయ్ అనే బీజేపీ కార్యకర్తపై స్థానిక ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒకవేళ బీజేపీ గనుక రౌడీయిజం చేస్తే బట్టలు విప్పి కొడుతారని హెచ్చరించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తీసుకెళ్లారని... దర్యాప్తులో భాగంగా అయితే ఓకె గానీ... దాన్ని మాయం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాట అయిందని.. ఇకనుంచి ప్రభుత్వ విధానాలను బీజేపీ తీవ్రంగా ఎండగడుతుందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటింగ్లో పాల్గొన్న ప్రజలకు,సిబ్బందికి,సహకరించిన బీజేపీ కార్యకర్తలకు సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.