బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనా ? ఆయన వ్యాఖ్యల ఆంతర్యం అదేనా !!
రాజకీయాల్లోకి వచ్చి తక్కువ రోజుల్లోనే హల్ చల్ చేసిన బండ్ల గణేష్ రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అంటూ రాజకీయాల నుండి వైదొలిగారు. ఇక అప్పుడప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు బండ్ల గణేష్ . తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేసిన బండ్ల గణేష్ ఇంకా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్టేనా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. అందుకు ఆయన వ్యాఖ్యలే కారణం .
కాంగ్రెస్ లో చేరి రాజకీయాల్లో రచ్చ చేసిన బండ్ల గణేష్
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి హడావిడి చేసిన బండ్ల గణేష్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే సెవన్ ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటా అని సంచలనం సృష్టించిన బండ్ల గణేష్ ఆ తరువాత రాజకీయ పరిణామాలతో రాజకీయాలు తన ఒంటికి సరిపడవని బయటకు వెళ్లిపోయారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు . పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడిని అని చెప్పుకునే బండ్ల గణేష్ గత ఎన్నికల సమయంలో ఊహించని విధంగా కాంగ్రెస్ లో చేరి రచ్చ చేశాడు.
పర్మినెంట్ గా పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్ పెట్టిన బండ్ల తాజా ట్వీట్
తక్కువ కాలంలో బోలెడు సంచలనాలతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించాడు. కానీ రాజకీయాల్లో ఉన్నది , ఉంచుకున్నదీ పోయిందని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇది టెంపరరీగా కాదు.. పాలిటిక్స్కు ఫుల్స్టాప్ పెట్టేశాను అంతేనని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు .ఇక తాజాగా గబ్బర్ సింగ్ సినిమా వచ్చి 8ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా మరోమారు తనకు రాజకీయాలు సరిపడవని చెప్పారు . "జీవితంలో కిక్ కావాలంటే ఒక్క సినిమా నే ..నేను డిసైడ్ అయ్యా.. నాకు సినిమానే జీవితం .. సినిమాయే ప్రాణ౦ నా 15 సంవత్సరాల వయస్సులో సినిమా ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు.
రాజకీయాలు వద్దు సినిమాయే ముద్దు అని ట్విట్టర్ వేదికగా మరోమారు స్పష్టం చేసిన గణేష్
నాకు రాజకీయాలు వద్దు సినిమాయే ముద్దు అని ట్విట్టర్ వేదికగా మరోమారు స్పష్టం చేశారు . నావల్ల నా మాటలు వల్ల భాదపడ్డ ప్రతి ఒక్కరికి క్షమించమని కోరుతున్నా" అంటూ ఆయన ట్వీట్ చేశారు. మొత్తానికి ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన బండ్ల గణేష్ మరో మారు తాను రాజకీయాల జోలికి పోనని చెప్పారు. దీంతో బండ్ల గణేష్ రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినట్టే అని తెలుస్తుంది.