కి'లేడీ' బ్యాంకు ఉద్యోగి.. డిపాజిటర్ల రెండున్నర కోట్లు మాయం
హైదరాబాద్ : ఉన్నత ఉద్యోగంలో ఉండి చీప్ గా ఆలోచించింది ఓ కిలేడీ. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాల్సింది పోయి నొక్కేసింది. తక్కువ టైములో కోటికి పడగెత్తాలని భావించి డిపాజిటర్లకు కుచ్చుటోపి పెట్టింది. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ సమీపంలోని ముసారాంబాగ్ కు చెందిన కాశీభట్ల సురేఖ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ హోదాలో పనిచేసింది. 2008 నుంచి 2012 వరకు విధులు నిర్వహించింది. ఆ సమయంలో బ్యాంకుకు వచ్చే వృద్ధులను, మహిళలను టార్గెట్ చేస్తూ ఆకట్టుకునేది. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ వస్తుందని ఆశ చూపేది. అలా చాలామందితో ఎఫ్డీ లు చేయించిన సురేఖ.. దరఖాస్తుల్లో మాత్రం తన మొబైల్ నెంబర్ పేర్కొనేది.
అలా ఖాతాదారులతో డిపాజిట్లు చేయించాక.. రెండు మూడు నెలల వ్యవధిలో ఎఫ్డీ లను రద్దుచేస్తూ సొమ్ము తన ఖాతాలో వేసుకునేది సురేఖ. డిపాజిట్లంటే ఐదేళ్లు, పదేళ్లు కాలపరిమితి ఉండటం ఆమెకు కలిసొచ్చింది. ఒకసారి డిపాజిట్ చేశాక కాలపరిమితి వరకు ఖాతాదారులు పట్టించుకోరు. ఇదే సురేఖకు వరమైంది. న్యూమారుతీ నగర్ కు చెందిన బాలచందర్, ప్రేమ దంపతులు తమ ఎఫ్డీ కాలపరిమితి ముగియడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లారు. అయితే గతంలోనే విత్ డ్రా చేసుకున్నట్లు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. దాంతో చైతన్యపురి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టడంతో సురేఖ చేసిన మోసాలు వెలుగుచూశాయి. 11 మంది ఖాతాదారులకు సంబంధించి రెండున్నర కోట్లు కాజేసినట్లు తేలింది. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.