సమ్మె కారణంగా ఈ రోజుకూడా బ్యాంకులు బంద్..!! ఇబ్బంది పడుతున్న ఖాతాదారులు..!!
హైదరాబాద్ : వరుస సెలవులతో ఇబ్బంది పడుతున్న బ్యాంకు ఖాతాదారులకు ఉద్యోగుల సమ్మె శరాఘాతంగా మారుతోంది. సెలవుల తర్వాత బ్యాంకు లావాదేవులు నెరపుదామనుకున్న ఖాతాదారులు సమ్మె వార్త తెలుసుకుని అవాక్కవుతున్నారు. బ్యాంకు కార్య కలాపాలు ఈ నెల 26వ తేదీన (బుధవారం) పూర్తిగా నిలిచిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల విలీన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా సమ్మె చేయాలని బ్యాంకుల ఉద్యోగ, అధికారుల, కార్మిక సంఘాలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 5వేల బ్యాంకు శాఖల్లోని 85వేల మంది ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది సమ్మెలో పాల్గొంటారని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ వీవీఎస్ఆర్ శర్మ వెల్లడించారు.
బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు బ్యాంకు, ఏటీఎం సేవలు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. సమ్మెలో భాగంగా బ్యాంకు స్ట్రీట్లోని ఎస్బీఐ వద్ద యునైటెడ్ ఫోరమ్ నిరసన ప్రదర్శన, ర్యాలీలు ఉంటాయన్నారు. ఉద్యోగులకు వేతన సవరణ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
21న బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆపై వరుస సెలవులు..!
ప్రజలు, ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించి ఒకరోజు సమ్మెకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటిరే ఏటీఎంలలో అరకొరగా అందీ అందని డబ్బులతో ఇబ్బంది పడుతున్న జనాలకు ఏటీఎంల బంద్ మరింత కష్టాను కొనితెచ్చేదిగా కనిపిస్తోంది.