గ్రేటర్లోముగిసిన ప్రచారం -మద్యం బంద్ -బరిలో 1122మంది -74.67లక్షల ఓటర్లు - 9,101 బూత్లు
సాధారణ ఎన్నికలను తలపిస్తూ.. పది రోజులపాటు హోరాహోరీగా జరిగిన హైదరాబాద్ స్థానిక ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది. పోలింగ్కు 48 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంటుందన్న ఈసీ నిబంధనలతో అన్ని చోట్లా మైకులు మూగబోయాయి. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఈసీ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం నుంచి సిటీ అంతటా మద్యం షాపులు మూతపడ్డాయి. పోలింగ్ రోజు (డిసెంబరు 1) సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.
Recommended Video
బండి సంజయ్ మరో బండ్ల గణేష్ -బీజేపీ చీఫ్ సంచలన కామెంట్లపై కవిత ఫైర్ -బండ్ల అనూహ్య రియాక్షన్
బీజేపీ తరఫున కేంద్ర హోం మంత్రి అమిత్ షా బరిలోకి దిగడంతో చివరిరోజు ప్రచారం హోరెత్తిపోయింది. ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు, ప్రచారాలతో హంగామా చేశాయి. సాయంత్రం 6 తర్వాత గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ఆయా పార్టీ అభ్యర్థుల మైకులన్నీ మూతపడ్డాయి. మరోసారి గ్రేటర్ పీఠం నిలబెట్టుకోవాలని అధికార టీఆర్ఎస్ భావిస్తుండగా, ఈసారి బల్దియాను కైవసం చేసుకోవాలని బీజేపీ, గత వైభవాన్ని సాధించాలని కాంగ్రెస్, తమ డివిజన్లపై పట్టు కోల్పోకుండా ఎంఐఎం.. వేటికవే సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ప్రచార పర్వం ముగియడంతో పోలింగ్ నిర్వహణపై ఈసీ దృష్టిసారించింది. గ్రేటర్ లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. ఈసారి వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో బూత్ ల సంఖ్య పెరిగింది. మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుండగా, వాటిలో 1752 హైపర్ సెన్సిటివ్, 2934 సెన్సిటివ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
ఎందుకు చంపుతాం? కేసీఆర్ 100ఏళ్లు బతకాలి: అమిత్ షా సంచలనం -కామెంట్లు చూస్తే షాకవుతారు
డిసెంబర్ 1న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగనుంది. ఈసీ లెక్కల ప్రకారం గ్రేటర్ లో మొత్తం 74,67,256 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 38,89,637, స్త్రీలు 30,76,941కాగా, థర్డ్ జెండర్లు 415 మంది ఉన్నారు. పోలింగ్ విధుల్లో మొత్తం 36,404మంది సిబ్బంది పాల్గొంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర పోలీసు శాఖలకు చెందిన 52,500 మంది సిబ్బందిని మోహరించారు.