ఆ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం...! బీసీ నేతల సమరం.. 10న పార్లమెంట్ ముట్టడి
హైదరాబాద్ : అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు సరికాదని మండిపడుతున్నారు. అసలు ఈ బిల్లు చెల్లదని.. సుప్రీంకోర్టులో కూడా నిలవదంటున్నారు. అంతేకాదు కేంద్రం దిగొచ్చేలా దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. ఈమేరకు అఖిల భారత ఓబీసీ సమాఖ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
అదంతా ఎన్నికల స్టంట్...!
అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు - బీసీల భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై జరిగిన సమావేశానికి.. ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ వి.ఈశ్వరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో పేర్కొనలేదని గుర్తుచేశారు. కేవలం 4 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడమేంటని ప్రశ్నించారు.
అదే 56 శాతమున్న బీసీలకు తక్కువ శాతంలో రిజర్వేషన్లు కల్పించడం పాలకుల నియంత పోకడలకు నిదర్శనమన్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడానికి తాము వ్యతిరేకం కాదని.. ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్పుకొచ్చారు. కేంద్రానికి వారిపై అంత ప్రేమ ఉంటే సంక్షేమ పథకాలతో ఆదుకోవాలి గానీ.. ఇలా బీసీల పొట్ట కొట్టొద్దని సూచించారు.
బీసీలకు అన్యాయం...! దేశవ్యాప్త సమరం
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడంపై ఈనెల 10వ తేదీన పార్లమెంట్ ముట్టడిస్తామన్నారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ ఆందోళన కార్యక్రమానికి 29 రాష్ట్రాల నుంచి బీసీలు తరలివస్తారని తెలిపారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గడంపై బీసీలు పోరాడుతున్న సమయంలో కేంద్రప్రభుత్వం అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. ఇదంతా కూడా బీసీలకు అన్యాయం చేయడమేనంటూ ధ్వజమెత్తారు.
ఈబీసీ సాకుతో ఆటలా...!
ఈబీసీ సాకుతో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటున్నారు బీసీ నేతలు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 56 శాతం మేర ఉన్న బీసీ జనాభాకు రిజర్వేషన్లు తగ్గించి.. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం వెనుక రాజకీయ కోణం ఉందని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ల రాజకీయం చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు.