బీసీలంటే జెండాలు మోసేవాళ్లా?.. ఓట్లేసే మరమనుషులా? : ఆర్.కృష్ణయ్య ధ్వజం
హైదరాబాద్ : బీసీలను రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని ధ్వజమెత్తారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. బీసీలంటే ఓట్లేసే మరమనుషులు కారనే విషయం అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. ఆదివారం నాడు ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడిన కృష్ణయ్య.. బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. దేశ జనాభాలో 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న బీసీలకు చట్టసభల్లో న్యాయం జరగడం లేదని ఆరోపించారు.
డ్రీం క్యాబినెట్ - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
జెండాలు మోయడానికి.. జై జై లు కొట్టించుకోవడానికే బీసీలను పరిమితం చేస్తున్నారని ఆరోపించారు కృష్ణయ్య. మేలు చేసినవారిని గెలిపిస్తాం.. కీడు చేసినవారిని ఓడిస్తాం అని బీసీలంతా ఐక్యమత్యంగా ఉన్నప్పుడే రాజకీయ పార్టీలు తలొగ్గుతాయని అన్నారు. హక్కుల సాధన కోసం బీసీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందన్నారు. ఇప్పటినుంచైనా జనాభా దమాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో ఆర్. కృష్ణయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కృష్ణ కూడా పాల్గొన్నారు.