మండుతున్న ఎండలు.. తీసుకోవలసిన జాగ్రత్తలు
Recommended Video
హైదరాబాద్ : సమ్మర్ హీటెక్కిస్తోంది. వేడి గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోత చికాకు తెప్పిస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి ఎండలు దంచికొడుతుండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో మంచినీరే దివ్య ఔషధమని చెబుతున్నారు. ఎండ వేడిమితో శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంటుంది. కాబట్టి వడదెబ్బ తగలకుండా, ఎండల నుంచి ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
పెరుగుతున్న టెంపరేచర్
వేసవికాలం మొదటి నుంచే భానుడు భగభగ మండుతున్నాడు. రోజురోజుకి టెంపరేచర్ పెరిగిపోతోంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. అయితే సమ్మర్ హీట్ ను బ్లాస్ట్ చేసి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. లేదంటే తలనొప్పి, ఒళ్లు మంట, డీ హైడ్రేషన్ లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
హీట్ నుంచి రక్షణ మంత్రం
ఎండ వేడిమి నుంచి రక్షణ పొందాలంటే.. ప్రధానంగా ఇంటి వాతావరణం చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల వాటర్ తాగటం మంచిది. టైట్ దుస్తులు ధరించకుండా.. వదులుగా ఉండే వస్త్రాలు ఎంచుకోవడం బెటర్. ఇక తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేలా
ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో చాలామంది డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. దాని నుంచి బయటపడాలంటే.. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, మజ్జిగ తాగడం బెటర్. అలాగే పండ్ల జ్యూస్, కొబ్బరి నీళ్లు తాగడం కూడా మంచిదే. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే.. కచ్చితంగా మొఖానికి, తలకు గుడ్డ కట్టుకోవడం మరచిపోవద్దు. అలాగే గొడుగు తీసుకెళ్లడం, కళ్లకు చలువనిచ్చే స్పెక్ట్స్ పెట్టుకోవడం ఉత్తమం.
ఇంటర్ ఫలితాల్లో జాప్యం.. 10 నాడు కష్టమే.. మరో డెడ్ లైన్ ఏదంటే..!
వడదెబ్బ.. జాగ్రత్త సుమా
సమ్మర్ లో వడదెబ్బ చాలా డేంజరస్. వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరగడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా తప్పించుకోవచ్చు. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా వెంట వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోండి. క్రమం తప్పకుండా వాటర్ తాగుతూ ఉండండి. వేసవికాలంలో ఆల్కహాల్, సిగరెట్, కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే వాటివల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్సుంది.
ఎండలో ఎక్కువగా తిరుగుతుంటే సూర్యరశ్మి తగిలి వడదెబ్బ తాకే ఛాన్సుంది. దాంతో వాంతులు, అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. గుండె సంబంధిత, ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఎండలో తిరగకపోవడమే బెటర్.
పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త
ఎండకాలం ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక చిన్నపిల్లల విషయంలో మరికొంత కేర్ తీసుకుంటే మంచిది. అప్పుడే పుట్టిన పిల్లలు, పాలు తాగే వయసున్న పిల్లలకు కచ్చితంగా క్రమం తప్పకుండా తల్లి పాలు ఇవ్వడం బెటర్. వాతావారణంలో ఉష్ణోగ్రతలు పెరిగితే పిల్లల బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంటుంది. అయితే దాన్ని కంట్రోల్ చేయడం పిల్లల మెదడులో చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే పిల్లలకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఎండలో ఆడుకోవడం ద్వారా చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది. దాంతో శరీరానికి కావాల్సిన లవణాలు కోల్పోయి నీరసానికి గురవుతారు. అందుకే వారికి సాధ్యమైనంత నీళ్లు తాగించడం ఉత్తమం. వాళ్లు ఆటలో పడటంతో నీళ్లపై పెద్దగా ధ్యాస ఉండదు. కానీ, పెద్దవాళ్లే వారిని కనిపెడుతూ మధ్యమధ్యలో నీళ్లు తాగిస్తే మంచిది. ముఖ్యంగా ఆరేళ్ల లోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వారికి బాడీ టెంపరేచర్ బాగా పెరిగితే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
వృద్ధుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడికి వాళ్లు తొందరగా అలసిపోతారు. కొన్ని సందర్భాల్లో వేడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతుంటారు. వైద్యులను సంప్రదించి ఆహార నియమాలతో పాటు ఇతరత్రా సూచనలు తీసుకోవడం బెటర్.
చర్మ సంరక్షణ ఇలా..!
సమ్మర్ లో చర్మం తొందరగా ఎండ వేడికి గురవుతుంది. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దాంతో చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. కొన్ని చిట్కాలతో రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవచ్చు. చర్మం బాగా పొడిబారినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడగవద్దు. కానీ చల్లని నీటితో వీలైనన్ని సార్లు ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. అయితే అన్నింటికంటే ముందు నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం దెబ్బతినదు.
పోషక పదార్థాలు ఎక్కువగా లభించే పండ్లు తీసుకోవడం బెటర్. కీరదోస, బీట్రూట్, క్యారట్ లాంటి పచ్చి కూరగాయలు కూడా తీసుకోవచ్చు. కొబ్బరి బొండాలు, మజ్జిగ కూడా చర్మ సౌందర్యాన్ని కాపాడటానికి దోహదపడతాయి. వేసవిలో సాధారణంగా ముఖంపై జిడ్డు పేరుకుంటుంది. అయితే ఎండలో తిరిగొచ్చి ఇంటికి వచ్చిన వెంటనే ముఖం కడుక్కోవద్దు. కాసేపాగాక, చల్లటి నీటితో రెండు మూడు సార్లు కడుక్కుంటు ఫ్రెష్ గా కనిపిస్తారు. అయితే స్క్రబ్బర్లను మాత్రం ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది. మొత్తానికి ఈ వేసవికాలపు హీట్ ను కూల్ కూల్ గా మార్చుకోవాలన్నది మీ చేతుల్లోనే ఉంది. అయితే మాగ్జిమమ్ ఉదయం పూట, సాయంత్రం వేళ మీ పనులను చక్కాగా ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం పూట వీలైనంత వరకు ఇంట్లో ఉంటే బెటర్.