మీ డబ్బులు జర భద్రం.. మహా కంత్రీగాళ్లు వచ్చేశారు..!
హైదరాబాద్ : రోజుకో చోట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతునే ఉన్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతూ జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఏసీల్లో కూర్చుంటూ అమాయక జనాలకు గాలం వేస్తున్నారు. మాయమాటలు చెబుతూ బ్యాంకు ఖాతాల్లోంచి సొమ్ము కాజేస్తున్నారు. చోరీలు చేయాలంటే రిస్క్ అనుకుంటున్నారేమో.. కొత్త తరహాలో ఈవిధంగా జనాలను దోచేస్తున్నారు. ఒకే ఒక్క ఫోన్ కాల్తో అందినకాడికి దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. కూర్చున్న చోట నుంచే జనాల ఫోన్ నెంబర్లు సేకరించి పంగనామం పెడుతున్నారు. బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నామంటూ నమ్మించి కుచ్చుటోపి పెడుతున్నారు. ఆ క్రమంలో తాజాగా వెలుగుచూసిన మరో మోసం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..!
సైబర్ నేరగాళ్ల మోసాలు అన్నీ ఇన్నీ కావు. గల్లీ, ఢిల్లీ కాదేదీ తమ మోసాలకు అనర్హమన్నట్లుగా తయారయ్యారు. పూటకో వేషమేస్తూ రోజుకో మోసం చేస్తున్నారు కంత్రీగాళ్లు. కష్టపడి సంపాందించుకున్న అమాయకుల డబ్బులను తెలివిగా ఏసీ గదుల్లో కూర్చుని కొట్టేస్తున్నారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని బురిడీ కొట్టించి ఏటీఎం నెంబర్లు తీసుకుని క్షణాల వ్యవధిలో డబ్బులు కొట్టేసే ఘనులున్నారు. అదే క్రమంలో నిత్యం ఏదో రకంగా జనాలను మోసగిస్తూనే ఉన్నారు.
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కొన్ని కేసుల్లో బాధితులు బయటకు రాక.. పోలీసులకు ఫిర్యాదు చేయలేక కంత్రీగాళ్ల లీలలు వెలుగుచూడటం లేదు. కొన్ని సందర్భాల్లో మోసాల గుట్టు బయటపడుతున్నా.. ట్రేస్ చేసే విషయంలో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి సైబర్ మాయగాళ్లు ఈ మోసాల ఆపరేషన్ నడిపిస్తుండటంతో కేసుల శోధన కష్టతరంగా మారుతోంది.
పోలీసులకు ఏందీ దుస్థితి.. హైదరాబాద్ టు ఖమ్మం.. లీడర్ తిట్ల దండకం..! (వీడియో)
పూటకో వేషం.. రోజుకో మోసం
సైబర్ మోసగాళ్లు రూట్ మార్చుతున్నారు. రోజుకో తీరుతో జనాలను మాయ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఫోన్ కాల్ చేస్తూ బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతి తెలివి మితిమీరిపోయిన సైబర్ నేరగాళ్లు మరో రీతిలో మోసం చేస్తున్నారనేది దాని సారాంశం. దాదాపు మన మొబైల్ నెంబర్కు దగ్గరగా ఉండే నెంబర్తోనో లేదంటే కొత్త నెంబర్తోనో గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేస్తారు.
సార్, నేను పలానా దానికి రిజిస్ట్రేషనో లేదంటే దరఖాస్తో చేసే క్రమంలో నా మొబైల్ నెంబరుకు బదులు మీ నెంబర్ మొబైల్ తప్పుగా ఎంటరైంది. ఆన్లైన్ ప్రక్రియ కావడంతో ఓటీపీ అడుగుతోంది. ఇప్పుడే మీ మొబైల్కు ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. దయచేసి అది చెప్పగలరా అంటూ అదోలా అడుగుతారు. మీరు ఆ ఓటీపీ చెబితేనే నా అప్లికేషన్ పూర్తవుతుందంటూ దీనంగా మాట్లాడతారు.
కూల్గా, స్వీటుగా మాట్లాడి.. ఉన్నదంతా నొక్కేసి..!
అలా కూల్గా, స్వీటుగా మాట్లాడేసరికి ఎంతటివారైనా కరిగిపోవాల్సిందే. సరిగ్గా అక్కడే సైబర్ నేరగాళ్ల మోసాల పంట పండుతోంది. వాళ్లు అడిగినట్లు ఆ ఓటీపీ చెప్పామో.. మన బ్యాంకు సొమ్ము కొల్లేరే. ఆ ఓటీపీ మన బ్యాంకు ఖాతాకు చిల్లు పెడుతుందని తెలియక హడావిడిగా అవతలివారు అడగడం.. మనం చెప్పడం క్షణాల్లో జరిగిపోతుంది. ఆ క్షణాలే మోసగాళ్ల జేబులు నింపుతున్నాయి. ఆ ఓటీపీ మాయగాళ్లు వాడుకుని మన డబ్బులు నొక్కేస్తారన్నమాట.
చూశారుగా.. సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలు. అందుకే మీ సొమ్ముకు మీదే బాధ్యత. ఎవరైనా బ్యాంక్ కాల్స్ అంటూ ఫోన్ చేస్తే జాగ్రత్తపడండి. కాసేపాగాక మళ్లీ ఫోన్ చేయండంటూ అవతలి వాళ్ల కాల్ కట్ చేయండి. అంతలోపు మీ బ్యాంకు కస్టమర్ కేర్కు కాల్ చేసి విషయం వివరించండి. దాంతో మీకు వచ్చిన కాల్ ఒరిజినలా లేదంటే ఫేక్ కాలా అనేది వాళ్లు చెబుతారు. సో.. భద్రం బీకేర్ఫుల్ బ్యాంకు ఖాతాదారులు.