మందుబాబులకు ఎండాకాలం బీరు తిప్పలు.. నో స్టాక్ బోర్డులు ఎందుకంటే..!
హైదరాబాద్ : సమ్మర్ హీట్ పీక్ స్టేజీకి చేరింది. ఎండ వేడిమితో జనాలు బేజారవుతున్నారు. అయితే ఎండా కాలం ఎండే కాలంలా మారిందంటున్నారు బీరు ప్రియులు. మద్యం షాపుల దగ్గర ఎక్కడా చూసినా బీర్లు నో స్టాక్ అంటూ బోర్డులు దర్శనమిస్తుండటంతో బేజారు అవుతున్నారు. వేడిగాలులతో అలిసిపోయిన శరీరాన్ని కాసింత చల్లబరుద్దామనుకునే బీరు ప్రియులకు నిరాశే ఎదురవుతోంది.
వేసవి తాపంతో కాసింత ఉపశమనం పొందాలనుకుని బీర్లు సేవిస్తుంటారు మద్యం ప్రియులు. చల్లచల్లగా బీరు లాగిస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ అదో లోకంలో మునిగి తేలుతుంటారు. అయితే ఈ ఎండాకాలం బీర్ల షార్టేజ్తో ఎన్ని తిప్పలు వచ్చేరా నాయనా అనుకుంటూ తెగ బాధపడుతున్నారట.
4 స్థానాల్లో గెలిస్తే పుంజుకున్నట్లా.. తెలంగాణ పోరుగడ్డలో సక్సెస్ అవుతుందా?.. బీజేపీ టార్గెట్ ఏంటి?
ఎండాకాలం ఎంత కష్టమొచ్చే.. నో స్టాక్ బోర్డులు దర్శనం
సాధారణంగా బీర్ల అమ్మకాలు వేసవి కాలంలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ఎండ వేడిని భరించలేక చాలామంది మద్యం ప్రియులు ఇతర లిక్కర్ కన్నా బీర్లనే ఎంచుకుంటారు. ఉష్ణ తాపం నుంచి సేదదీరడానికి కూల్కూల్గా ఒకటి, రెండు బీర్లేసి చల్లబడుతారు. అయితే ఎండాకాలంలో డిమాండ్కు తగ్గ సప్లై మాత్రం జరగడం లేదు.
తెలంగాణవ్యాప్తంగా బీర్ల కొరత ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో కాస్తా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో బీరు ప్రియులు బేజారవుతున్నారు. ఇక కొన్ని చోట్ల ఒక్కరికి ఒకే బీరు స్కీమ్ అమలు చేస్తున్నారట. దానికోసం చాంతాండంతా క్యూ లో నిల్చుని.. ఆ వచ్చిన ఒక్క బీరు తీసుకుని ఎక్కడా లేని సంతోషంతో వెనుదిరుగుతున్నట్లు సమాచారం.
చల్లచల్లగా బీరేద్దామంటే.. నో స్టాక్తో మద్యం ప్రియులు బేజారు
మందు బాబులకు ఎండా కాలం తిప్పలు తప్పడం లేదు. పొద్దంతా కష్టపడి ఏ రాత్రికో ఇంటికి చేరుతూ ఓ బీరు తీసుకెళదామనే ఆశలకు గండి పడుతోంది. ఏ వైన్ షాపు దగ్గర చూసిన బీరు లేదనే సమాధానం వస్తోంది. బీర్లు లేవంటూ వచ్చిన కస్టమర్లకు సమాధానం చెప్పలేక మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఎంత చెప్పినా బీరు ప్రియులు వినకుండా ఒక్కటైనా ఇవ్వండంటూ ఫోర్స్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే కొన్ని చోట్ల లిక్కర్ ఉంది గానీ, బీర్లు స్టాక్ లేవంటూ బోర్డులు పెట్టేస్తున్నారు.
ఎండాకాలం బీర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ.. సరైన ఉత్పత్తి జరగకపోవడంతో మద్యం ప్రియులకు తిప్పలు తప్పడం లేదు. అయితే బీర్ల ప్రొడక్షన్ కోసం సరైన నీరు దొరకకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో 5 బ్రూవరీలు బీర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ప్రొడక్షన్కు అవసరమైన నీటిని సింగూరు జలాశయం నుంచి సరఫరా చేస్తోంది ప్రభుత్వం. అయితే ఎండాకాలం తాగునీటి ఎద్దడి దృష్ట్యా.. ఆ 5 బ్రూవరీలకు మే ఒకటవ తేదీ నుంచి నీటి సరఫరాను నిలిపివేసింది సర్కార్. అందుకే బీర్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.
సింగూరు జలాశయం నీళ్లు రాక.. ట్యాంకర్ల ధరలు భరించలేక..!
ఇన్నాళ్లు సింగూరు జలాశయం నుంచి నీటిని తీసుకుని బీర్లను తయారుచేసిన బ్రూవరీలకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ప్రభుత్వం నీటి సరఫరాను నిలిపివేయడంతో ట్యాంకర్ల మీద, వారికి సంబంధించిన సొంత బోరు నీటి మీద ఆధారపడుతున్నాయి. అయితే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకోవడమనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ప్రతినిత్యం రెండున్నర లక్షల కేసుల బీర్లు తయారుచేసే బదులు కేవలం లక్షన్నర కేసులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి.
ఇంతకుముందు ఒక్కో మద్యం దుకాణానికి సంబంధించి.. దాదాపు 100 పెట్టెల వరకు బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల ద్వారా బీర్లు సరఫరా చేసేది. ఇప్పుడు కొరత కారణంగా కేవలం 25 కేసుల వరకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మే నెలలో 70 లక్షల కేసుల వరకు గిరాకీ ఉన్నా కూడా సప్లై మాత్రం బాగా తగ్గిందని చెబుతున్నారు వైన్ షాప్స్ నిర్వాహకులు. మొత్తానికి ఎండాకాలంలో బీర్లు దొరకక మద్యం ప్రియులు మాత్రం పరేషాన్ అవుతున్నారు.