గుర్రపు బండిపై అసెంబ్లీకి కాంగ్రెస్ సభ్యులు: అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత, బీజేపీ, టీఆర్ఎస్పై ఫైర్
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ వినూత్నరీతిలో నిరసన తెలిపింది. రైతులు, ప్రతిపక్షాల భారత్ బంద్కు మద్దతుగా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్రపు బండిపై అసెంబ్లీకి వచ్చారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, తదితర నేతలు గుర్రపు బండిపై వచ్చారు. దీంతో వారిని అసెంబ్లీ బయటే పోలీసులు ఆపేశారు. ఈ క్రమంలో అక్కడే రోడ్డుపై బైఠాయించారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలోకి కార్లలో మాత్రమే రావాలని ఉందా? గుర్రపు బండిపై రాకూడదని అసెంబ్లీ రూల్స్లో ఉందా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు నారాయణగూడ పీఎస్కు తరలించారు. పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వెళ్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి.. ప్రజలపై భారం పడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని ధ్వజమెత్తారు.
బీజేపీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. హైదరాబాద్లో రెండో రోజు కొనసాగుతున్న శాసనసభ వర్షాకాల సమావేశానికి కాంగ్రెస్ నేతలు గుర్రపు బండ్లపై వెళ్లారు. గాంధీభవన్ నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుర్రపు బండ్లపై వెళ్లి కేంద్ర విధానాలపై నిరసన తెలిపారు.
కేంద్ర, రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయాలు వ్యతిరేకించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏంటో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. కేంద్ర సర్కార్ విధానాలతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని.. సాగును ప్రైవేట్వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని సీతక్క ఆరోపించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భారత్ బంద్కు కాంగ్రెస్, వామపక్షాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. భారత్ బంద్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ ప్రభావం కనిపించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన భారత్ బంద్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఏపీలో ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 12 గంటలకు వరకు బంద్ చేశారు. అధికార వైసీపీ మద్దతివ్వడంతో బంద్ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలోనూ బంద్ ప్రభావం కనిపించింది.