కిలాడీ లేడీ.. నటీనటులుగా ఛాన్స్ ఇస్తానంటూ..!
హైదరాబాద్ : స్క్రీన్ మీద ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడే వాళ్లు చాలామంది ఉంటారు. తెర మీద ఒక్కసారైనా కనిపించాలనే తాపత్రాయం వారిని ఒక్కదగ్గర ఉండనివ్వదు. వెండితెర కాకపోయినా కనీసం బుల్లితెరపైనైనా మెరిసిపోవాలని కలలు కంటారు. అయితే అలాంటి వారి ఆశలను సొమ్ము చేసుకోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు.
నటనలో అ,ఆలు తెలియని ఓ లేడి కిలాడీ పలువుర్ని బురిడీ కొట్టించింది. తనకు తాను పేరున్న టీవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్గా ప్రమోట్ చేసుకుని లక్షలు కొల్లగొట్టింది. అవకాశం కోసం పరితపించిన కొందరు ఈ మాయలేడీ బుట్టలో పడి మోసపోయారు. చివరకు కథ అడ్డం తిరగడంతో కటకటాలు లెక్కిస్తోంది.
నటనలో అ,ఆలు రావు.. కానీ మోసాల్లో ఆరితేరింది
చిత్తూరు జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీలత అలియాస్ శ్రీదేవి అలియాస్ సుస్మిత బెంగళూరులో నివాసం ఉంటోంది. అయితే టీవి సీరియల్స్ తెగ చూసే శ్రీలత వాటికి అడిక్ట్ అయిపోయింది. ఆ క్రమంలోనే టీవి డైరెక్టర్గా అవతారమెత్తి అందినకాడికి దోచుకోవాలని ప్లాన్ వేసింది. ఓ టీవి ఛానెల్లో వచ్చే సీరియల్ను ఫాలో అయ్యే శ్రీలతకు చెడు ఆలోచన వచ్చింది. టైటిల్స్లో కనిపించిన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మల పేరుపై ఆమె నజర్ పడింది.
అలా ఆమె పేరుతో 2018 జులైలో ఫేక్ ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసింది శ్రీలత. ఇక అప్పటినుంచి నటీనటులుగా అవకాశం ఇప్పిస్తానంటూ శ్రీదేవి తుమ్మల పేరుతో పలువుర్నీ బురిడీ కొట్టించింది. లక్షల్లో డబ్బులు గుంజి మోసాలకు పాల్పడింది.
ఇప్పటిదాకా 10 లక్షలు, ఇప్పుడేమో లక్ష.. 9999 క్రేజ్ తగ్గిందా.. లేదంటే గోల్మాలా?
డైరెక్టర్గా ఫోజులు.. అమాయకుల జేబులకు చిల్లులు
సీరియల్స్ క్రమం తప్పకుండా చూస్తూ వాటికి అలవాటు పడ్డ శ్రీలత ఈజీ మనీ కోసం ఆరాటపడింది. ఏ సీరియల్స్కు తాను అడిక్ట్ అయిందో అవే సీరియల్స్ను తన మోసాలకు వేదికగా ఎంచుకుంది. అలా శ్రీదేవి తుమ్మల పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఇక నటించాలనే తపన కనబరిచేవారిని ప్రత్యేకంగా ఎంచుకుని మరీ వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేంది.
ఎదుటివారికి ఈ కిలాడీ గురించి తెలియక నిజమైన డైరెక్టర్ కావొచ్చేమోనని చాలామంది ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు. అలా వారికి సీరియల్స్లో ఛాన్సులు ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించింది. వీలైనప్పుడల్లా తన అకౌంట్లో డబ్బులు వేయించుకుంటూ విలాస జీవితానికి అలవాటుపడింది.
అవకాశాల పేరిట మోసం.. లక్షలు మాయం
కొత్తవారిని టార్గెట్ చేయడమే కాదు.. ఇదివరకే బుల్లితెరపై రాణిస్తున్న టీవి ఆర్టిస్టులను సైతం ఫేస్బుక్ ఫ్రెండ్స్గా మలచుకుంది. ఆ క్రమంలో నిషామా, కరుణ, శిరీష లాంటి నటులతో శ్రీదేవి తుమ్మల పేరుతో ప్రతి నిత్యం ఛాటింగ్ కూడా చేసేది. ఇక ఎవరైనా ఛాన్సుల కోసం ఫేస్బుక్ వేదికగా సంప్రదిస్తే చాలు.. వారి జేబులు గుల్ల చేసేది.
2018, సెప్టెంబర్ నెలలో వంశీ అనే వ్యక్తికి సీరియల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ నమ్మబలికింది. అలా అతడి నుంచి 50 వేల రూపాయలు వసూలు చేసింది. అలాగే మణికొండకు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తిని 6 లక్షల రూపాయల మేర నిండా ముంచింది. ఆమె పంపించే ఫోటోలకు ఫిదా అయిపోయిన క్రాంతి కుమార్ ప్రేమలో పడ్డాడు. అలా అతడి బలహీనతను క్యాష్ చేసుకుంది ఈ మాయలేడీ.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం.. కాళేశ్వరం విశిష్టతలేంటంటే..!
అసలు డైరెక్టర్ కంప్లైంట్.. కటాకటాల్లోకి నకిలీ డైరెక్టర్
శ్రీలత మోసాలు కాస్తా శ్రీదేవి తుమ్మల దృష్టికి వెళ్లడంతో ఆమె అలర్టయ్యారు. శ్రీలత తన పేరును వాడుకుని అమాయకులకు కుచ్చుటోపి పెడుతోందని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. టెక్నాలజీ సాయంతో ఈ లేడీ కిలాడీని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా శ్రీలతపై ఇలాంటి కేసులున్నట్లు తెలుస్తోంది.