స్థానిక సంస్థల పోరుపైనా కన్నేసిన ఒవైసీ: అసద్తో బిహార్ మజ్లిస్ ఎమ్మెల్యేలు భేటీ: రోడ్ మ్యాప్
హైదరాబాద్: ఎవరూ ఊహించని విధంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల భారత మజ్లిస-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ సత్తా చాటింది. ఏకంగా అయిదు శాసనసభ స్థానాలను ఎగరేసుకెళ్లింది. ఇదివరకు ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైన మజ్లిస్.. ఈ సారి తన సంఖ్యను మెరుగుపర్చుకుంది. అసెంబ్లీలో తన బలాన్ని అయిదుకు పెంచుకోగలిగింది. బిహార్కే చెందిన అనేక పార్టీలు సాధించలేని సంఖ్య అది. దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ పార్టీకి అయిదు ఎమ్మెల్యే సీట్లను కట్టబెట్టారు బిహారీలు.
బిహార్ ఎన్నికలపై ఏడీఆర్ షాకింగ్ రిపోర్ట్: 81 శాతం మంది అలాంటి వారే: 5వ తరగతి వరకే
సీమాంచల్పై పట్టు సాధించేలా..
అత్యంత కీలకమైన, రాజకీయంగా ప్రాధాన్యత గల సీమాంచల్ ప్రాంతంలో అయిదు అసెంబ్లీ సీట్లను ఎంఐఎం తన ఖాతాలో వేసుకోగలిగింది. కిషన్ గంజ్ సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకున్నప్పటికీ.. దానికి నష్టపరిహారంగా అయిదు స్థానాలను దక్కించుకోగలిగింది. ఈ విజయం ఇచ్చిన ఊపును మరింత కొనసాగించేలా మజ్లిస్ అగ్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. బిహార్లో ఇకపై ఎలాంటి ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ.. సంసిద్ధంగా ఉండే దిశగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగడానికి ఏర్పాట్లు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడం, కొత్త ప్రాంతాలను విస్తరింపజేయడమే మజ్లిస్ అగ్ర నేతల లక్ష్యంగా కనిపిస్తోంది. బిహార్ నుంచి కొత్తగా అసెంబ్లీకి ఎన్నకైన అయిదు మంది మజ్లిస్ ఎమ్మెల్యేలు.. హైదరాబాద్కు వచ్చారు. పార్టీ అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మర్యాదపూరకంగా వారు బిహార్ నుంచి హైదరాబాద్కు వచ్చారు.
ఆ అయిదుమందీ వీరే..
అయిదుమంది ఎమ్మెల్యేలు, బిహార్ మజ్లిస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఒవైసీని కలిసిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు అఖ్తరుల్ ఇమాన్-అమౌర్, సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్-బైసీ (పూర్ణియా జిల్లా), షానవాజ్ ఆలమ్-జొకిహాట్ (అరారియా జిల్లా), మహ్మద్ ఇజార్ అష్ఫి-కొచ్చాధమన్, మహ్మద్ అన్సార్ నయీమి-బహదూర్ గంజ్ (కిషన్ గంజ్ జిల్లా) ఒవైసీని కలిశారు. ఈ ఉదయం తన నివాసానికి వచ్చిన వారిని అసదుద్దీన్ ఒవైసీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.
Recommended Video
క్షేత్రస్థాయిలో పటిష్టత కోసం..
ఈ సందర్భంగా- స్థానిక సంస్థల అంశం వారి మధ్య చర్యకు వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము పర్యవేక్షిస్తామని కొత్త ఎమ్మెల్యేలు అసదుద్దీన్ ఒవైసీకి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని అంచనా వేయడానికి వీలు ఉంటుందని, దీని ద్వారా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవచ్చని కొత్త ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. వారితో ఒవైసీ ఏకీభవించారని అంటున్నారు.
కాంగ్రెస్ సీనియర్ను మట్టి కరిపించిన మజ్లిస్ అభ్యర్థి..
వారిలో అమౌర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అఖ్తరుల్ ఇమాన్.. మజ్లిస్ బిహార్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కూడా. అమౌర్లో ఆరుసార్లు విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ జలీల్ మస్తాన్ను ఆయన ఓడించారు. ఈ నియోజకవర్గంపై మజ్లిస్ జెండా ఎగరడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అబ్దుల్ జలీల్ మస్తాన్ను కాదని ఇమాన్కు ఓటర్లు పట్టం కట్టడం పట్ల బిహార్ రాజకీయాల్లో కొత్త గాలి వీస్తోందనే సంకేతాలను పంపించిందని వ్యాఖ్యానిస్తున్నారు.