బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ కారు: మహిళకు తాకడంతో మృతి, వీడియో వైరల్
హైదరాబాద్: నగరంలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పైనుంచి అత్యంత వేగంగా వెళుతున్న ఓ కారు పైనుంచి కింద పడింది. ఆ కారు కిందున్న ఓ మహిళకు తాకడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
బయోవర్సిటీ ఫైఓవర్పై దారుణం.. మితిమీరిన వేగంతో జంప్ కొట్టిన కారు.. (వీడియో)#Hyderabad #flyover #Overspeed pic.twitter.com/NN9dTYROZ8
— Oneindia Telugu (@oneindiatelugu) November 23, 2019
కారు పడటంతో కింద ఉన్న కొన్ని కార్లు కూడా ధ్వంసమయ్యాయి. కారు ధాటికి చెట్టు కూడా కుప్పకూలింది. అక్కడేవున్న 9మందికి గాయాలయ్యాయి. బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదానికి కారణమైన కారులోని వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
రాయదుర్గం-మైండ్స్పేస్ వెళ్లే ఈ ఫ్లై ఓవర్పై నుంచి పడటంతో వోక్స్ వ్యాగన్ కారు తునాతునకలైంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 15 మీటర్ల ఎత్తునుంచి పడటం.. ఆ కారు ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళకు తాకడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాగా, ఆమె పక్కనే ఉన్న కూతురు తీవ్ర భయాందోళనకు గురైంది. తల్లి కళ్లముందే చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది.
కాగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి ప్రమాద ఘటనతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఘటనపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. కారు అత్యంత వేగంగా ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ఘటనపై అధికారులతో విచారణ చేయిస్తున్నట్లు వెల్లడించారు. మృతి చెందిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది.