కుళ్ళిన చికెన్ తో బిర్యానీ .. ఆ బావర్చి హోటల్ కు 20 వేలు జరిమానా
హోటళ్లలో ఘుమఘుమలాడే బిర్యాని తింటున్నాం అని తెగ సంబర పడుతున్నారా? కానీ మీరు తినే ఆహార పదార్థాల నాణ్యత గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అస్సలు ఆలోచించి ఉండరు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి హోటల్ లోనూ చాలా రోజుల పాటు నిల్వ చేసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను పెడుతున్నారంటే మన హోటల్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మొన్నటికి మొన్న పారడైజ్ హోటల్ లో జరిగిన ఘటన మరిచిపోకముందే తాజాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి గేట్ దగ్గర ఉన్న రెడ్ బావర్చి రెస్టారెంట్లో పాడైపోయిన ఆహార పదార్థాలను హోటల్ కి వచ్చిన వారికి పెడుతున్నట్టు గుర్తించారు మున్సిపల్ అధికారులు. రెడ్ బావర్చి రెస్టారెంట్ లో దాడులు నిర్వహించిన మున్సిపల్ అధికారులు ఆహార పదార్ధాల నాణ్యతను పరిశీలించారు. కుళ్లిపోయిన, నిల్వ ఉన్న చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. దాంతోనే బిర్యానీ చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు హోటల్ నిర్వాహకులకు అధికారులు రూ.20వేలు జరిమానా విధించారు.
పురుగులు పట్టిన చికెన్.. దర్జాగా అమ్ముతూ.. అధికారులకు అడ్డంగా చిక్కి..!
ఇక హోటల్ లో సేకరించిన శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. పాడైపోయిన ఆహార పదార్థాలు పెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు సదరన్ హోటల్ యజమాని హెచ్చరించారు. హోటల్పై మెరుపు దాడి చేసి అక్కడ పరిసరాలను పరిశీలించిన మున్సిపల్ అధికారులు అశుభ్ర వాతావరణాన్ని, పాడైపోయిన చికెన్ ను వండి వడ్డిస్తున్న తీరును చూసి హోటల్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.